ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్పందించాలి
ABN , First Publish Date - 2021-01-21T05:14:00+05:30 IST
ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనుకూలంగా స్పందించాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
కడప(మారుతీనగర్), జనవరి 20: ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనుకూలంగా స్పందించాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ తప్పెట హరిబాబు అధ్యక్షతన బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఎంఆర్పీఎస్ రాయలసీమ జిల్లాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. ఇప్పటికే మనదేశంలోని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తుండగా, మరో 7 రాష్ట్రాలు సైతం అనుకూలంగా ఉన్నాయన్నారు. కాగా మన రాష్ట్రంలో వర్గీకరణకు వ్యతిరేకంగా ఉండడం సబబుగా లేదన్నారు. వర్గీకరణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి సాధించే వరకు విశ్రమించరాదని మాదిగలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిగపాలకొండయ్య, సలహాదారుడు గొడుగునూరు మునెయ్య, జిల్లానాయకులు జి.గురవయ్య, ఓబయ్య, భాస్కర్, శివ పాల్గొన్నారు.