కడప సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2021-11-28T04:54:10+05:30 IST
కడప జిల్లా అంబవరానికి చెందిన 12 సంవత్సరాల బాలికకు రిమ్స్లోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేశారు.
కడప(సెవెన్రోడ్స్), నవంబరు 27 : కడప జిల్లా అంబవరానికి చెందిన 12 సంవత్సరాల బాలికకు రిమ్స్లోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేశారు. వివరాల్లోకి వెళితే బాలిక నెల రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ సర్వజన ఆసుపత్రికి రాగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె ఉన్నట్టు గుర్తించారు. బాలికకు వెంట్రుకలు తినే అలవాటు ఉంది. ఇవన్నీ కడుపులో చేరి తుట్టెగా మారి జీర్ణకోశం చిన్నపేగులకు అడ్డుపడుతున్నట్టు గుర్తించారు. డాక్టర్ వాణి నేతృత్వంలో శస్త్ర చికత్స నిర్వహించి బాలిక కడుపులో నుంచి సుమారు ఆరు మీటర్ల పొడవు కేజిన్నర్ర బరువు గల కణతిలా ఏర్పడిన వెంట్రుకల తుట్టెను తొలగించారు. శస్త్రచికిత్సలో వైద్యులు రమణయ్య, సోమశేఖర్, సాదిక్, లోకేష్, గాయత్రి, సునీల్, నర్సింగ్ బృందం నిర్మల, గురులక్ష్మి పాల్గొన్నారు.