దళితుల భూములు ఆక్రమించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-11-27T05:06:10+05:30 IST
దళితుల భూములను ఆక్రమించిన వైసీపీ నాయకులతోపాటు వారికి మద్దతు పలుకుతున్న తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని మాలమహానాడు నేతలు డిమాండ్ చేశారు.

జమ్మలమడుగు రూరల్, నవంబరు 26: దళితుల భూములను ఆక్రమించిన వైసీపీ నాయకులతోపాటు వారికి మద్దతు పలుకుతున్న తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని మాలమహానాడు నేతలు డిమాండ్ చేశారు. ఆమేరకు జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రామాజీఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో బైఠాయించి ధర్నా చేశారు. ఏడు సంవత్సరాల నుంచి ముద్దనూరు మండలం కె.కొత్తపల్లె గ్రామ నివాసి, దళితుడు అయి న శాంతయ్య, సునీత పొలం సాగు చేసుకుని జీవనం సాగిస్తుంటే ఆ పొలంపై అదే గ్రామానికి చెందిన సర్పంచ్ ఆక్రమించి దళితులకు ఇబ్బంది కలిగిస్తున్నాడన్నారు. దళితులపై దౌర్జన్యంతో అక్కడే బోరు కూడా వేశారని వారికి మద్దతుగా తహసీల్దారు, ఆ గ్రామ వీఆర్వో దళితులను బెదిరిస్తున్నారన్నారు. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించినా పోలీసులు కూడా వైసీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. గత నెలలో ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించినా ఏమాత్రం ఫలితం లేకపోవడంతో మరోమారు ఆర్డీవో శ్రీనివాసులకు వినతి పత్రం అందజేసి ఆయన చాంబర్లో దళితులు బోరున విలపించారు. ఈ విషయంపై వెంటనే ఆర్డీవో సంబందిత తహసీల్దారుకు, సెక్రటరీకి ఫోన్ చేసి దళితులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుని జీవిస్తుం టే వారిని బెదిరించడం ఏమిటని మందలించారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కమిటీ నాయకులు వెంకటరమణ, వినోద్కుమార్, ప్రసాద్, ఓబులేసు పాల్గొన్నారు.