ఆకతాయిలు అవమానకరంగా మాట్లాడారని.. అవమానం భరించలేక..
ABN , First Publish Date - 2021-01-17T05:18:11+05:30 IST
తమ కుమార్తె పట్ల కొందరు ఆకతాయిలు..
బావిలో దూకిన తల్లీకూతుళ్లు
కుమార్తె మృతి, చెట్టుకొమ్మకు తగులుకున్న తల్లి
బ్రహ్మంగారిమఠం(కడప): తమ కుమార్తె పట్ల కొందరు ఆకతాయిలు అవమానకరంగా మాట్లాడారనే మనస్థాపంతో తల్లీకూతుళ్లు బావిలో దూకగా తల్లి చెట్టుకొమ్మకు ఇరుక్కుని బయటపడగా కుమార్తె లింగాలదిన్నె లక్ష్మీభార్గవి (16) బావిలో పడి మృతి చెందింది. బి.మఠం ఎస్ఐ శ్రీనివాసులు వివరాల మేరకు... బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నెకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి, రమణమ్మల కుమార్తె లక్ష్మీభార్గవి పట్ల కొందరు యువకులు అవమానకరంగా వ్యవహరించారని తల్లికి చెప్పి బాధపడింది. దీంతో అవమానం భరించలేక తల్లి రమణమ్మ, కుమార్తె లక్ష్మీభార్గవి ఇద్దరూ శుక్రవారం రాత్రి వారి పొలంలోని బావిలో దూకారు.
అయితే తల్లి రమణమ్మ బావిలో ఉన్న చెట్టుకొమ్మకు ఇరుక్కుపోగా, కుమార్తె నీళ్లలో పడిపోయింది. దీంతో తల్లి పెట్టిన కేకలతో చుట్టుపక్కల వారు బావి నుంచి వస్తున్న కేకల ఆధారంగా చెట్టుకొమ్మల్లో ఇరుక్కున్న రమణమ్మను బయటకు తీశారు. చీకటి కావడంతో నీళ్లలో పడిన కుమార్తెను బయటకు తీయలేకపోయారు. శనివారం ఉదయం మృతదేహం బయటకు తేలియాడడంతో పోలీసులు బయటకు తీశారు. ఈ సంఘటనకు కారణమైన ఎనిమిది మందిపై మృతురాలి తల్లి రమణమ్మ, తండ్రి లక్ష్మీనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు 306/109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.