భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-03-24T05:32:25+05:30 IST
జిల్లాలో రహదారుల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా (ఆర్అండ్బీ) శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర రవాణా(ఆర్అండ్బీ) శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు
కడప (కలెక్టరేట్), మార్చి 23: జిల్లాలో రహదారుల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా (ఆర్అండ్బీ) శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాలులో జిల్లాలోని జాతీయ రహదారులు, ఆర్అండ్బీ రోడ్స్, రైల్వేస్ కొరకు జరుగుతున్న భూసేకరణ పనులపై రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ అర్జా శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్లు ఎం.గౌతమి, సాయికాంత్వర్మలతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కడప, రాజంపేట సబ్ కలెక్టర్లు పృథ్వీతేజ్, కేతన్గార్గ్, డీఆర్వో మలోల, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, సంబంధిత శాఖల ఈఈలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృధ్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగా జిల్లా మీదుగా వెళ్లే రహదారులు, రైల్వే పనుల కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రకియ్రలో అటవీ, పర్యావరణ, కోర్టు సంబంధిత అంశాలు, అభ్యంతరాలు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. జాతీయ రహదారులు, ఇరిగేషన్, ట్రాన్స్కో, భూగర్భజల శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో గడువులోగా భూసేకరణ పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. అత్యవసరంగా రోడ్డు మరమ్మతులు, ప్యాచింగ్ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భూసేకరణ పనులు వేగవంతం : కలెక్టర్
కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో నేషనల్ హైవే, రైల్వే మార్గాల అభివృద్ధికి, నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేశామన్నారు. అందుకు సంబందించి అయా రెవెన్యూ డివిజన్ల సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. భూసేకరణ పనుల లక్ష్యం, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి కృష్ణబాబుకు కలెక్టర్ వివరించారు.