హత్య కేసులో కర్ణాటక వాసికి జీవిత ఖైదు
ABN , First Publish Date - 2021-12-31T05:17:33+05:30 IST
హత్య కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీరామ్ అలియాస్ శ్రీనాధ్ అలియాస్ రమేశ్ (30)కు కడప జిల్లా కోర్టు జడ్జి సి.పురుషోత్తంకుమార్ జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు.
![హత్య కేసులో కర్ణాటక వాసికి జీవిత ఖైదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కడప (రూరల్), డిసెంబరు 30: హత్య కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీరామ్ అలియాస్ శ్రీనాధ్ అలియాస్ రమేశ్ (30)కు కడప జిల్లా కోర్టు జడ్జి సి.పురుషోత్తంకుమార్ జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. కడప రూరల్ సీఐ శ్రీరామ్ శ్రీనివాసులు, చింతకొమ్మదిన్నె ఎస్ఐ ఎం.మంజునాఽథరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్లోని కొండకింద అగ్రహారానికి చెందిన శ్రీరామ్ వివాహిత లలితతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. వీరిద్దరూ కలసి తిరుపతిలో రెండేళ్లు సహజీవనం చేశారు. అయితే లలిత భర్త సంజీవ్ అలియాజ్ సంజు భార్య తనను వదిలి వెళ్లిపోవడంతో రేణిగుంట రైల్వేస్టేషన్లో భిక్షమెత్తుకుంటూ అక్కడ నుంచి కడప రైల్వేస్టేషన్కు చేరుకుని సమీపంలోని అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట నిద్రించేవాడు. ఈ నేపథ్యంలో అతడిని శ్రీరామ్ 2019 నవంబర్ 13న పెద్ద బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. ఈ మేరకు మామిళ్లపల్లె వీఆర్వో పి.వినోద్బాబు ఫిర్యాదు చేయడంతో అప్పటి సీకేదిన్నె ఎస్ఐ రాజరాజేశ్వర్రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడిని 2019 అక్టోబర్ 17న అప్పటి కడప రూరల్ సీఐ వినయ్కుమార్రెడ్డి అరెస్ట్ చేశారు. తదుపరి కేసుపై జిల్లా కోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. గురువారం ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతా్పకుమార్రెడ్డి వాదనలు వినిపించారు. పూర్వాపరాలను విచారించిన జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తం కుమార్ నిందితుడు శ్రీరామ్కు జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.500లు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.