30న కడప బార్ అసోసియేషన్ ఎన్నికలు
ABN , First Publish Date - 2021-03-23T04:27:17+05:30 IST
కడప న్యాయవాదుల సంఘం పాలక వర్గానికి సంబంధించి 2021-22 సంవత్సరానికి గాను ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూలును ఎన్నికల అధికారి (సీనియర్ న్యాయవాది) ఎన్.రవీంద్రనాథరెడ్డి విడుదల చేశారు.
![30న కడప బార్ అసోసియేషన్ ఎన్నికలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కడప (రూరల్), మార్చి 22: కడప న్యాయవాదుల సంఘం పాలక వర్గానికి సంబంధించి 2021-22 సంవత్సరానికి గాను ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూలును ఎన్నికల అధికారి (సీనియర్ న్యాయవాది) ఎన్.రవీంద్రనాథరెడ్డి విడుదల చేశారు. పాలకవర్గంలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి, కార్యదర్శి-1, 2, అలాగే గ్రంథాలయ కార్యదర్శి, మహిళా కార్యదర్శి తదితర పదవులకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 26 వరకు ఉదయం 10-30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. అలాగే 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ తరువాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. అనంతరం సాయంత్రం 4-30 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఓటర్లు పోలింగ్ సమయంలో ఏపీ బార్ కౌన్సిల్ నుంచి పొందిన గుర్తింపు కార్డులను వెంట తీసుకొని ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులు ప్రచారం చేయరాదన్నారు. ఈ విషయంలో అభ్యర్థులు, ఓటర్లు ఎన్నికల అధికారులకు, ఎన్నికల సహాయకులకు సహకరించాలని కోరారు. ఏదేని అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అధికారికి వివరించవచ్చని పేర్కొన్నారు.