జేసీబీతో ఇల్లు కూల్చివేత
ABN , First Publish Date - 2021-05-21T04:58:25+05:30 IST
నగరంలోని చెమ్ముమియాపేట రెడ్డిచావిడిలో నిర్మించిన ఇంటిని రెవెన్యూ అధికారులు గురువారం జేసీబీతో తొలగించేందుకు యత్నిం చారు. కాగా, ఆ ఇంటిని తాము కొన్ని సంవత్సరాల కిందట వేరే వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి రిజిస్టరు చేయించుకున్నామని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ ఇంటిని కూలదోస్తారా అని ఆందోళనకు దిగారు.

సమాచారం ఇవ్వలేదంటూ బాధితుల ఆందోళన
2 గంటల పాటు ఉత్కంఠ
కడప(క్రైం), మే 20: నగరంలోని చెమ్ముమియాపేట రెడ్డిచావిడిలో నిర్మించిన ఇంటిని రెవెన్యూ అధికారులు గురువారం జేసీబీతో తొలగించేందుకు యత్నిం చారు. కాగా, ఆ ఇంటిని తాము కొన్ని సంవత్సరాల కిందట వేరే వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి రిజిస్టరు చేయించుకున్నామని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ ఇంటిని కూలదోస్తారా అని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కడప తహసీల్దార్ శివరామిరెడ్డి, తాలుకా ఎస్ఐలు రాఘవేంద్రారెడ్డి, హుసేన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు ఎలా నిర్మాణం చేపడతారని, మొత్తం సామాన్లన్నీ తొలగించాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ ఇంటి యజమానురాలు రెడ్డమ్మ తమ ఇంటిని కూలిస్తే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతానంటూ ఇంటి వద్ద జేసీబీని అడ్డుకున్నారు. దీంతో రెండు గంటల పాటు ఇంటి నిర్మాణ తొలగింపు ఉత్కంఠగా సాగింది. ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు వారిని బయటకు పిలిపించి జేసీబీ ద్వారా ఇంటిని కూల్చివేశారు. ఇదిలా ఉండగా, ఇంటికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని, అలా కాకుండా పలుమార్లు నోటీసులు ఇచ్చినా ప్రభుత్వ స్థలం ఖాళీ చేయకపోవడంతోనే ఇంటిని తొలగించినట్లు కడప తహసీల్దారు పేర్కొన్నారు.