‘పరిషత్ ఎన్నికల రద్దు ప్రభుత్వానికి చెంపపెట్టు’
ABN , First Publish Date - 2021-05-22T05:08:05+05:30 IST
మండల పరిషత్ ఎన్నికల రద్దు వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టు అని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ తెలిపారు.

రైల్వేకోడూరు, మే 21: మండల పరిషత్ ఎన్నికల రద్దు వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టు అని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించ లేదని, జరిగిన పరిషత్ ఎన్నికలు హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. వైసీపీ కి ఆది నుంచి కోర్టులు మొట్టిక్కాయలు వేస్తున్నాయని విమర్శించారు. మండల పరిషత్ ఎన్నికలను ఇష్టానుసారంగా నిర్వహించడం పట్ల కోర్టు ఎన్నికలను రద్దు చేసిందన్నారు. వైసీపీ అధికారాన్ని చూపి టీడీపీ కార్యకర్తలు, నాయకులపైన తప్పుడు కేసులు పెట్టడం, పోలీసులతో అరెస్టులు చేయించడం జరుగుతోందన్నారు. కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోకుండా మొండి గా వ్యవహరించడం జరిగిందన్నారు. కొవిడ్ కేసులు పెరగడానికి వైసీపీయే కారణం అని చెప్పారు. రుయా ఆస్పత్రిలో జరిగిన మరణాలపై విచారణ చేయాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో రావణ రాజ్యం సాగుతోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కోర్టు ధిక్కారం చేస్తే ఎలా ఉంటుందో అనేది మండల పరిషత్ రద్దు తీర్పు వైసీపీకి చెంప పెట్టులాంటిదన్నారు.