సందడిగా సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2021-01-16T05:35:09+05:30 IST

మండలంలో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

సందడిగా సంక్రాంతి సంబరాలు
కొత్తపేట రామాపురంలో చిట్లాకుప్పకు నిప్పు పెట్టిన దృశ్యం

రైల్వేకోడూరు, జనవరి, 14: మండలంలో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బలిజవీధి, కొత్తబజారు, పొట్టిశ్రీరాముల వీధులలో వెలసిన శ్రీ కోందరామాలయాల్లో ఉత్సవ విగ్రహలను పుర వీధుల్లో ఊరేగించారు.  రైల్వేకోడూరు కోదండరామాలయం నుంచి టోల్గేట్‌ వరకు శోడిశెట్టి సుబ్రమణ్యం(ఎర్రమణి) ఆధ్వర్యంలో పార్వేట ఉత్సవం నిర్వహించారు. టోల్గేట్‌ సర్కిల్‌లో కనుమ భోగి వేశారు. ఎడ్లను ఊరేగించారు. స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు గునిశెట్టి సాయికుమార్‌ ఆధ్వర్యం లో శుక్రవారం పిల్లలకు గాలిపటాలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కాగా పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం రాత్రి పడి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. 


రాజంపేటలో.... : రాజంపేట మండలం వెంకటరాజంపేట గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామ భజన బృందం సభ్యులు కలిసి సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అలాగే పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో స్వామికి పల్లకీసేవ నిర్వహించారు. అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.


రాయచోటిలో... :  సంక్రాంతి పండుగలో చివరి రోజు కనుమ సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు కాటమరాజుకు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. పశువులను ప్రత్యేకంగా అలంకరించి చిట్లా కుప్ప వద్ద ప్రదక్షిణలు చేయించారు. రాయచోటి మునిసిపాలిటీ పరిధిలోని కొత్తపేట రామాపురం, చెన్నముక్కపలె, పంచముఖ ఆంజ నేయ స్వామి దేవలం, పాతరాయచోటి, మాసాపేట వంటి ప్రాంతాలలో చిట్లాకుప్పలను ఏర్పాటు చేశారు. పూజల అనంతరం చిట్లాకుప్పకు నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా రైతులు తాము పండించిన అనపకాయలు, అలసంద, గుమ్మడికాయలను చిట్లాకుప్ప నిప్పుల్లో వేశారు. చిట్టాకుప్ప వద్ద పలువురు కొబ్బరికాయలు కొట్టారు.  చిట్లాకుప్పలను చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు.

 


Updated Date - 2021-01-16T05:35:09+05:30 IST