థియేటర్లపై.. కొరడా

ABN , First Publish Date - 2021-12-25T06:21:20+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 30 సినిమా థియేటర్లపై జాయింట్‌ కలెక్టర్‌(రైతుభరోస, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ కొరఢా ఝళిపించారు.

థియేటర్లపై.. కొరడా

30 థియేటర్లకు షోకాజ్‌ నోటీసులు

రూ.10 వేల వంతున పెనాల్టీ విధింపు

15 రోజుల్లో కొత్త లైసెన్సులు పొందాలని ఆదేశాలు

పెనాల్టీ చెల్లింపునకు, లైసెన్సుల రెన్యువల్‌కు గడువు

లేకపోతే ప్రదర్శనల నిలిపేస్తామని అధికారుల హెచ్చరిక


గుంటూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 30 సినిమా థియేటర్లపై జాయింట్‌ కలెక్టర్‌(రైతుభరోస, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ కొరఢా ఝళిపించారు. లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్‌కి దరఖాస్తు చేసుకోకుండా చిత్ర ప్రదర్శనలు చేస్తోన్నారని పేర్కొంటూ సంజాయిషి నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులకు థియేటర్ల యాజమాన్యాలు స్పందించలేదని, బీ-ఫారం లైసెన్సు లేకుండా షోలు వేయడం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ జేసీ పెనాల్టీలను విధించారు. ఒక్కో థియేటర్‌కి రూ.10 వేల వంతున పెనాల్టీని విధించారు. మూడు రోజుల వ్యవధిలో పెనాల్టీ మొత్తాన్ని చెల్లించి 15 రోజుల వ్యవధిలో కొత్త లైసెన్సులు పొందకపోతే ప్రదర్శనలు నిలిపేస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై 30 రోజుల వ్యవధిలో ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి అప్పీలు చేసుకోవచ్చని చెప్పారు.


ఈ థియేటర్లకు పెనాల్టీలు

జిల్లాలో శ్రీ వెంకటేశ్వర టాకీస్‌(క్రోసూరు), శ్రీనివాస టాకీస్‌(క్రోసూరు), సాయికృష్ణ థియేటర్‌(సత్తెనపల్లి), శ్రీనివాస మహల్‌(సత్తెనపల్లి), శ్రీ లక్ష్మిటాకీస్‌(సత్తెనపల్లి), శ్రీగంగా మహల్‌(పిడుగురాళ్ల), భాస్కర్‌డీలక్స్‌(చిలకలూరిపేట), జయలక్ష్మి మూవీల్యాండ్‌(యడ్లపాడు), గోపిపిక్చర్‌ ప్యాలెస్‌(వెల్లటూరు), వెంకటరమణపిక్చర్‌ ప్యాలెస్‌(పిట్టలవానిపాలెం), పీవీఆర్‌ టాకీస్‌(నిడుబ్రోలు), శ్రీలక్ష్మిపిక్చర్‌ప్యాలెస్‌(గుంటూరు), శివ సినిమాస్‌(గుంటూరు), సినీస్క్వేర్‌(గుంటూరు), ఎస్‌ఆర్‌టీ సినిమాహాల్‌(పెదనందిపాడు), ఈశ్వర్‌సాయి థియేటర్‌(ఫిరంగిపురం), శ్రీ తులసీ థియేటర్‌(తుళ్లూరు), అలంకార్‌ థియేటర్‌(నడికుడి), పల్నాడు ఐనాక్స్‌ థియేటర్‌(కారంపూడి), విజయభాస్కర్‌(చిలకలూరిపేట), కేఆర్‌ మినీ థియేటర్‌(చిలకలూరిపేట), శ్రీ కార్తీక్‌ సిటీ సెంటర్‌ స్ర్కీన్‌-1(చిలకలూరిపేట), శారదాంబ(నరసరావుపేట), శ్రీ లక్ష్మీనరసింహా థియేటర్‌(నరసరావుపేట), ఈశ్వర్‌మహల్‌(నరసరావుపేట), శ్రీకృష్ణ చిత్రాలయ(నరసరావుపేట), విఘ్నేశ్వర ప్యాలెస్‌(చేబ్రోలు), శ్రీమంత్‌మహల్‌(చేబ్రోలు), శ్రీనివాస టాకీస్‌(కొల్లూరు), విఘ్నేశ్వర థియేటర్‌(నిజాంపట్నం)లు నిబంధనలు ఉల్లంఘించాయని పెనాల్టీలు విధించారు. 


కొనసాగుతోన్న కోల్డ్‌వార్‌

సినిమా టిక్కెట్లు, ఆన్‌లైన్‌లో విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోన్న విషయం తెలిసిందే. టిక్కెట్‌ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్ల యజమానులు హైకోర్టులో సవాలు చేయడంతో సింగిల్‌ బెంచ్‌ కోర్టు న్యాయమూర్తి ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేశారు. డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వం అప్పీలు చేసినా ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలోనే డిసెంబరు 17వ తేదీ నుంచి సినిమా థియేటర్లలో తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ బృందాలను నియమించి తనిఖీలు నిర్వహించారు. 



Updated Date - 2021-12-25T06:21:20+05:30 IST