సంక్రాంతి నుంచి సమరమే
ABN , First Publish Date - 2021-12-31T06:05:10+05:30 IST
సంక్రాంతి పండుగలోగా ప్రభుత్వం పీఆర్సీని తేల్చకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమమే లక్ష్యంగా కొనసాగుతామని ప్యాప్టో రాష్ట్ర చైర్మన్ సీహెచ్ సుధీర్బాబు తెలిపారు.

ప్యాప్టో రాష్ట్ర చైర్మన్ సీహెచ్ సుధీర్బాబు
ఫిరంగిపురం, డిసెంబరు 30: సంక్రాంతి పండుగలోగా ప్రభుత్వం పీఆర్సీని తేల్చకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమమే లక్ష్యంగా కొనసాగుతామని ప్యాప్టో రాష్ట్ర చైర్మన్ సీహెచ్ సుధీర్బాబు తెలిపారు. గురువారం ఫిరంగిపురంలోని సెయింట్పాల్స్ హైస్కూల్ ఆడిటోరియంలో ఎస్టీయూ వజ్రోత్సవాల సభలో ఆయన ప్రసంగించారు. అషితోష్మిశ్రా నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై సీఎం జగన్మోహన్రెడ్డి జేఏసీతో చర్చించాలన్నారు. నవరత్నాల్లో ఒక రత్నం సీపీఎస్ రద్దని ప్రకటించి రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీకి దిక్కులేకుండా పోయిందన్నారు. హెల్త్ కార్డులు పని చేయటం లేదని, మెడికల్ రీయింబర్స్మెంట్ ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రంలో ఎనిమిది వందల మంది ఉద్యోగులు కరోనాతో మృతి చెందితే ఇంత వరకు కారుణ్య నియామకాలు లేవన్నారు. ఎస్టీయూ రాష్ట్ర మహా సభలు త్వరలో కర్నూలులో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దబాబు, జిల్లా కార్యదర్శి పీ భాస్కర్, జహంగీర్, ఎంఈవో బీ రాజకుమారి, జెడ్పీటీసీ దాసరి కత్రేణమ్మ, ఎంపీపీ సహేల నర్గీస్, సర్పంచ్లు మేడా బాబు, దాసరి మెల్కీ తదితరులు పాల్గొన్నారు.