సంగం డేటా చోర్యం
ABN , First Publish Date - 2021-05-07T05:57:03+05:30 IST
సంగం డెయిరీకి సంబంధించి కీలక సమాచారం డేటాను బయట వ్యక్తులు చోరీ చేస్తున్నారంటూ గురువారం మహిళా ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు
బయట వ్యక్తులు ప్రవేశం
డెయిరీ ఎదుట ఉద్యోగుల నిరసన
చేబ్రోలు మే 6: సంగం డెయిరీకి సంబంధించి కీలక సమాచారం డేటాను బయట వ్యక్తులు చోరీ చేస్తున్నారంటూ గురువారం మహిళా ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఏసీబీ అధికారులతో పాటు కొంతబయట వ్యక్తులు డెయిరీ డేటా సర్వర్ విభాగంలోకి ప్రవేశించారని ఉద్యోగులు ఆరోపించారు. దశాబ్ధాల తరబడి సమకూర్చుకున్న కీలక సమాచారాన్ని అపహరించేందుకు యత్నించారని తెలిపారు. కేసుకు సంబంధంలేని డేటా సేకరణ ఎలా చేస్తారని వారిని ఉద్యోగులు అడ్డుకున్నారు. అయినా వచ్చిన వారు సోదాలకు సిద్ధమవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనగా డెయిరీ వెలుపలుకు వచ్చి ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ గోపాలకృష్ణన్లు డెయిరీలో వేలాది మందికి ఉపాధి కల్పించారన్నారు. లక్షలాది మంది పాడి రైతులకు మేలు చేస్తున్నారని తెలిపారు. లక్షల మంది ప్రయోజనాలతో ముడిపడి ఉన్న సంస్థను నిర్వీర్యం చేసేందుకే చైర్మన్, ఎండీలను అరెస్టు చేశారని ఆరోపించారు. రెండు వారాలుగా సోదాలు జరుగుతున్నప్పటికి ఏమీ దొరక్క కేసుకు సంబంధంలేని వ్యవహారాలలో ఏసీబీ అధికారుల వల్ల అంతర్గత డేటాకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. తమ వివరాలను సేకరిస్తున్న ఏసీబీ అధికారులు కనీసం వారి పేర్లను కానీ, హోదాలను కానీ వెల్లడించడంలేదన్నారు. బయట వ్యక్తుల ప్రవేశం గురించి న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు ముందుకు వెళ్తామని ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగులు నిరసనతో వడ్లమూడి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెకలొంది.