ఆసుపత్రుల్లో బెడ్లను పెంచాలి
ABN , First Publish Date - 2021-05-02T05:43:33+05:30 IST
జిల్లాలో కొవిడ్ -19 వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా అవసరమైన సంఖ్యలో ఆసుపత్రులలో బెడ్లను పెంచాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీరంగనాఽథరాజు
గుంటూరు, మే 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ -19 వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా అవసరమైన సంఖ్యలో ఆసుపత్రులలో బెడ్లను పెంచాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. కొవిడ్ నివారణ చర్యలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి రంగరాజు, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్లతో కలిసి కొవిడ్ -19 నోడల్ అధికారులు, ఆసుపత్రుల యజమానులతో సమీక్ష నిర్వమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెమ్ డిసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా నేరుగా కొవిడ్ ఆసుపత్రులకు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలానే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆసుపత్రులను కొవిడ్ ఆసుపత్రులుగా ఏర్పాటుకు అనుమతించి తగుచర్యలు వెంటనే తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా డిమాండ్కు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుచుకోవాలన్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులలో మోరేట్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి కొవిడ్ ఆసుపత్రుల నుంచొ కొవిడ్ కేర్ సెంటర్స్కు కాని, హోం ఐసోలేషన్కు కాని తరలిస్తే తీవ్ర లక్షణాలతో ఉన్న కరోనా పేషెంట్లకు బెడ్స్ను అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ఫలితాలు 24 గంటల్లో అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ జిల్లాలో వైరస్ సోకిన వారికి అవసరమైన వైద్యసేవలు అందించేందుకు అనుగుణంగా ఆక్సిజన్, బెడ్లు కొరత లేకుండా చూడాలని సూచించారు. జిల్లాలో బ్యాక్లాగ్లో ఉన్న ఆరువేల శాంపిల్స్ను యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామనారు. అలానే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుస్తున్నామన్నారు. జేసీ (రైతు, భరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్కుమార్ మాట్లాడుతూ రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, బెడ్స్ అవైలబులిటీ వివరాలను కొవిడ్ -19 డాష్ బోర్డులో ఆదివారం నుంచి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మూడవ విడతగా 12 ఆసుత్రులను కొవిడ్ -19 ఆసుపత్రులుగా మార్చినట్లు జేసీ (సచివాలయాలు, అభివృద్ధి) పి.ప్రశాంతి తెలిపారు. అలానే జిల్లాకు పదెనిమిది వేల కొవిడ్ -19 వ్యాక్సినేషన్ వైల్స్ అందాయని, వీటిని జిల్లాలోని వివిధ కేంద్రాలకు పంపి, వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. జిల్లాకు వచ్చిన నాలుగు వేల యాంటిజెన్ కిట్లతోను కొవిడ్ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ (ఆసరా, సంక్షేమం) కె.శ్రీధర్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె.యాస్మిన్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.