అమరావతితోనే స్వర్ణాంధ్ర సాధ్యం
ABN , First Publish Date - 2021-12-30T05:40:23+05:30 IST
అమరావతి ఎదుగుదలతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని రాజధాని రైతులు తెలిపారు.

743వ రోజుకు చేరుకున్న అమరావతి ఆందోళనలు
తుళ్లూరు, డిసెంబరు 29: అమరావతి ఎదుగుదలతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఆందోళనలు బుధవారంతో 743వ రోజుకు చేరుకున్నాయి. రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ఆదాయ వనరులాంటి అమరావతిని విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా చేశారని విమర్శించారు. అమరావతిని అభివృద్ధి చేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందోనని రాజకీయ కుట్ర పన్నారన్నారు. ఎక్కడా లేని విధంగా సీఎం జగన్రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేయడానికి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా వెళితే ప్రజలు సహించరన్నారు. విశాఖ పట్నంలోని భూముల ధరలు పెంచుకోవడానికి మూడు ముక్కల ఆటన్నారు. ఇప్పటికే విశాఖ చుట్టు పక్కల అధికార పార్టీ నేతలు వెంచర్లు వేసి అధిక ధరలకు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అమరావతిలో కాదని విశాఖలో జరిగిందని తెలిపారు. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, ఐనవోలు, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు తదితర రాజధాని గ్రామాలలో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.