అమ్మో.. మేము రాము!
ABN , First Publish Date - 2021-08-29T05:30:00+05:30 IST
అమరావతి మహానగర..
రాజధాని టెం‘డర్’!!
ఏఎంఆర్డీఏ టెండర్లకు స్పందన నిల్
ఆసక్తి వ్యక్తీకరణ అసలే లేదు
సింగిల్ టెండర్ కూడా పడని పరిస్థితి
టెండర్లలో పాలుపంచుకోవటానికి ఆసక్తి చూపని సంస్థలు
గడువు పెంచుకోవాల్సిన దుస్థితి
రూ. 50 కోట్ల లోపు టెండర్లకు కూడా స్పందన కరువు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అమరావతి మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏఎంఆర్డీఏ) టెండర్లకు స్పందన కరువైంది! రాజధానిలో ఎంపిక చేసిన వాటికి మాత్రమే ఏఎంఆర్డీఏ టెండర్లు పిలుస్తుంటే కాంట్రాక్టు సంస్థలు అమ్మో మేము రాము అంటున్నాయి. కనీసం కాంట్రాక్టు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కూడా రావటం లేదు! టెండర్లు పిలుస్తున్నప్పటికీ సింగిల్ టెండర్ కూడా పడని పరిస్తితి ఏర్పడింది! టెండర్లకు కాంట్రాక్టు సంస్థల నుంచి స్పందన రాకపోవటంతో ఏఎంఆర్డీఏ గడువులు పెంచుతోంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతికి ప్రభుత్వం ప్రాధాన్యత తగ్గించిన సంగతి తెలిసిందే! రాజధానిలో గత ప్రభుత్వం తలపెట్టిన పలు నిర్మాణ పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. వీటికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అంగుళం కూడా పురోగతి లేదు.
అమరావతిపై జరిగే సమీక్షలలో పాతిక శాతం కంటే ఎక్కువ పురోగతి ఉన్న పనులు చేపట్టాలని పైకి నిర్దేశిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆ దిశగా అడుగులు పడటం లేదు! దీంతో ప్రభుత్వం అమరావతికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ అర్ధమవుతోంది. దాదాపుగా రెండేళ్ళకు పైగా అమరావతిలో ఏఎంఆర్డీఏ చేపట్టాల్సిన పనులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇటీవల కొంత కాలంగా ప్రభుత్వం కొన్ని పనులకు సంబంధించి టెండర్లు పిలుస్తోంది. ఏ ఒక్క దానికి కూడా స్పందన రాకపోవటం గమనార్హం. అవేంటో చూద్దాం..
ఇంటీరియం గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆర్ఎఫ్పీకి స్పందన నిల్ :
వెలగపూడిలోని ఇంటీరియం గవర్నమెంట్ కాంప్లెక్స్లో మెకానికల్, ఎలక్ర్టికల్, ప్లంబింగ్ (ఎంఈపీ) పనుల కోసం రూ. 91.5 లక్షల వ్యయంతో ఏఎంఆర్ డీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)ను పిలిచింది. ఈ ఆర్ఎఫ్పీను ఇదే ఆగస్టు నెల 8వ తేదీన ఏఎం ఆర్డీఏ పిలిచింది. ఏఎంఆర్డీఏ పిలిచిన ఆర్ఎఫ్పీకి సంబంధించి ఏ ఒక్క సంస్థ కూడా ఆసక్తి చూపించ లేదు. దీంతో ఈ నెల 21 వ తేదీన టెండర్ల గడువును పొడిగించింది. ఈ నెల 27వ తేదీన టెండర్ల గడువు పొడిగింపుకు సంబంధించి కోరియాండమ్-2 ను విడుదల చేసింది. ఈ ఆర్ఎఫ్పీకి సంబంధించి వాస్తవా నికి సెప్టెంబరు1తో గడువు ముగుస్తుంది. ఆర్ఎఫ్పీకు ఏ కాంట్రాక్టు సంస్థ నుంచి కూడా స్పందన రాకపోవటంతో ఏఎంఆర్డీఏ గడువును పెంచాల్సి వచ్చింది.
హైకోర్టులో 14 కోర్టు హాళ్ళ నిర్మాణ కాంప్లెక్స్ టెండర్లకు నో టెండర్
నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు ఆవరణలో 76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 కోర్టు హాళ్ళను రూ. 29.40 కోట్ల వ్యయంతో జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మించేందుకు ఏఎంఆర్డీఏ ఆగస్టు 16వ తేదీన టెండర్లు పిలిచింది. ఈ టెండర్లకు సంబంధించి 14 కోర్టు హాల్స్ను జీప్లస్ 5 స్టోరీస్ ఫౌండేషన్, ఆర్సీ కాలమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్, ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్, మెకానికల్ , ఎలక్ర్టికల్, ప్లంబింగ్ (ఎంఈపీ) సర్వీసులు, లిఫ్టులు ఇతర అనుబంధ పనులకు సంబంధించి ఈ టెండర్లను పిలిచింది. సెప్టెంబరు 1 వ తేదీతో టెండర్ల గడువు ముగుస్తుండగా.. ఇప్పటి వరకు సింగిల్ టెండర్ కూడా పడలేదు. హైకోర్టు పనులకు సంబంధించి పనులు అయినప్పటికీ ఏఎంఆర్డీఏ పిలిచిన టెండర్లకు కనీస స్పందన రాకపోవటం గమనార్హం.
క్యాపిటల్ సిటీ పరిధిలో మెయింట్నెన్స్ పనులకు సంబంధించి ఈ నెల 24 వ తేదీన అమరావతి మహానగర్ ప్రాధికార సంస్థ (ఏ ఎంఆర్డీఏ) రూ. 9.12 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచింది. తుళ్ళూరులోని జ్యూడీషియల్ కాంప్లెక్స్, చీఫ్ జస్టిస్ (సీజే), చీఫ్ సెక్రటరీ (సీఎస్) బంగళా పనుల నిర్వహణకు సంబంధించి, మంచినీటి పైపులైన్లు, సాంకేతిక సిబ్బందిని నియమించుకోవటానికి ఏఎంఆర్డీఏ ఈ టెండర్లను పిలిచింది. ఈ టెండర్లకు సంబంధించి చూస్తే సెప్టెంబరు 7వ తేదీ నాటికి తుది గడువుగా ఉంది. ఇప్పటి వరకు సింగిల్ టెండర్ కూడా పడలేదని తెలుస్తోంది.
హ్యాపీనెస్ట్కు రివర్స్ టెండర్స్.. ఆసక్తి డౌటే
గత ప్రభుత్వం హయాంలో అప్పటి సీఆర్డీఏ టెండర్లు పిలిచిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత ఏఎంఆర్డీఏ ఆగస్టు 25వ తేదీన రివర్స్ టెండర్లు పిలిచింది. గత ప్రభుత్వ హయాంలో ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రూ.656.44 కోట్లతో టెండర్లు పిలవటం జరిగింది. దీని పనుల పర్యవేక్షణకు అప్పట్లో ప్రాజెక్టు మేనేజ్మెంట్ కంపెనీ (పీఎంసీ) గా సీబీఆర్ఈని నియమించటం జరిగింది. అప్పుడు పిలిచిన టెండర్లలో ఎస్పీసీఎల్ సంస్థ ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకుంది. ఈ పనులను ప్రారంభించాల్సిన ప్రస్తుత ప్రభు త్వం ఆ దిశగా చాలాకాలం అడుగులు వేయలేదు. హ్యాపీనెస్ట్లో ప్లాట్ల కోసం పది శాతం డబ్బులు కట్టిన లబ్దిదారులకు ఈ ఏడాది డిసెంబర్లో వాటిని అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పనులే మొదలు కాలేదు. మరో నాలుగు నెలల సమయం మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో, తాజాగా ఏఎంఆర్డీఏ రివర్స్ టెండర్లను పిలిచింది. సెప్టెంబరు 22 నాటికి ఆఖరు తేదీగా నిర్ణయించటం జరిగింది. ఈ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచి ఇప్పటికే మూడేళ్ళు కావస్తుండటంతో పెరిగిన అంచనాల నేపథ్యంలో, రివర్స్ టెండరింగ్లో పాలు పంచుకునేందుకు ఏ కాంట్రాక్టు సంస్థ కూడా సిద్ధంగా లేదని తెలుస్తోంది.