ఉద్యమాన్ని అణచి వేయాలని కుట్ర
ABN , First Publish Date - 2021-05-11T05:58:42+05:30 IST
అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని చేస్తోన్న ఉద్యమాన్ని అణచి వేయాలని పాలకులు అనేక కుట్రలు చేశారని రైతులు, మహిళలు తెలిపారు.
510వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు
తుళ్లూరు, తాడికొండ, మే 10: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని చేస్తోన్న ఉద్యమాన్ని అణచి వేయాలని పాలకులు అనేక కుట్రలు చేశారని రైతులు, మహిళలు తెలిపారు. రైతులు, రైతుకూలీలు, దళిత జేఏసీ నేతలు చేస్తోన్న అమరావతి ఆందోళనలు సోమవారంతో 510వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూములు త్యాగం చేసిన రైతులు ఆవేదన చెందుతుంటే పాలకులు అవహేళనలకు దిగుతున్నారన్నారు. అమరావతిని నిర్వీర్యం చేయాలని పాలకులు చూడటం దుర్మార్గమన్నారు. శక్తివంతమైన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తున్న సీఎం జగన్ కూర్చున్న కొమ్మనే నరికేందుకు సిద్ధపడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మం, న్యాయం తమ వైపు ఉందని పోరాటాన్ని అణగ దొక్కాలని చూస్తే నాశనం అవుతారన్నారు. పాలనాదక్షత ఉన్న వారిని ఎన్నుకుంటే ఈ తిప్పలు ఉండేవి కావని తెలిపారు. ఒక్కఛాన్స్ అంటే ఎంతో అభివృద్ధి ఊహించామని.. తీరా అందలం ఎక్కి నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాజధాని 29 గ్రామాలతో పాటు రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు.