ప్రభుత్వాస్పత్రిలో రివిజన్‌ హిప్‌ ఫిక్సేషన్‌ సర్జరీ

ABN , First Publish Date - 2021-02-05T05:54:37+05:30 IST

గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి ఎముకలు, కీళ్ల విభాగంలో మహిళకు అరుదైన రివిజన్‌ హిప్‌ ఫిక్సేషన్‌ సర్జరీ నిర్వహించారు.

ప్రభుత్వాస్పత్రిలో రివిజన్‌ హిప్‌ ఫిక్సేషన్‌ సర్జరీ
కోలుకుంటున్న శ్రీలక్ష్మితో వైద్యులు

తొలిసారిగా కస్టమ్‌ మేడ్‌ ప్రాస్థసిస్‌ వినియోగం

గుంటూరు(మెడికల్‌), ఫిబ్రవరి 4: గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి ఎముకలు, కీళ్ల విభాగంలో మహిళకు అరుదైన రివిజన్‌ హిప్‌ ఫిక్సేషన్‌ సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో జీజీహెచ్‌లో తొలిసారిగా కస్టమ్‌ మేడ్‌ ప్రాస్థసిస్‌ ఇంప్లాంట్‌ వాడటం  విశేషం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన సుంకర శ్రీలక్ష్మి(43) 12 ఏళ్ల కిందట ఆటో ఢీకొట్టడంతో తుంటి ఎముక విరిగింది. అప్పట్లో ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ చేశారు. అయితే  ఈ ఏడాది జనవరిలో ఆమె ఇంట్లో జారి పడటంతో తుంటి ఎముకతో పాటు లోపల అమర్చిన ఇంప్లాంట్‌ కూడా విరిగిపోయింది. దీంతో ఆమెను 20 రోజుల కిందట గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేరగా ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ జీ వరప్రసాద్‌ పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి 3న ఆమెకు రివిజన్‌ సర్జరీ   విజయవంతంగా నిర్వహించారు. 44 మిల్లీ మీటర్ల బైపోలార్‌ లాంగ్‌ స్టెమ్‌ ఇంప్లాంట్‌ను అమర్చారు. శస్త్రచికిత్సలో ఆయనతో పాటు ఆర్థోపెడిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మధుకర్‌, పీజీ విద్యార్థి లోకేశ్‌, మత్తు వైద్యులు పోలయ్య, నాగభూషణం పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆపరేషన్‌ ఉచితంగా చేసినట్లు  వైద్యులు తెలిపారు. అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యనిపుణులను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి అభినందించారు.


Updated Date - 2021-02-05T05:54:37+05:30 IST