ప్రధాన రహదార్లకు మహర్దశ

ABN , First Publish Date - 2021-03-25T05:22:47+05:30 IST

నిత్యం పెరుగుతున్న వాహన రద్దీకి తోడుగా ఆ రహదార్లు విస్తరణకు నోచుకోకపోవటం లేదు. దీంతో తరుచూ జరుగుతున్న ప్రమాదాలను గమనించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమస్యలను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, నేషనల్‌ హైవే అధారిటీ ఆఫ్‌ ఇండియా కార్యదర్శులను కలిసి రహదారుల విస్తరణ, అభివృద్ధిపై పలుమార్లు విన్నవించారు.

ప్రధాన రహదార్లకు మహర్దశ

4 వరుసలుగా పేరేచర్ల- కొండమోడు, దాచేపల్లి -మాచర్ల రహదార్లు

విస్తరణకు రూ. వెయ్యి కోట్లు ఫ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చొరవ 

గుంటూరు, మార్చి 24: నిత్యం పెరుగుతున్న వాహన రద్దీకి తోడుగా ఆ రహదార్లు విస్తరణకు నోచుకోకపోవటం లేదు. దీంతో తరుచూ జరుగుతున్న ప్రమాదాలను గమనించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమస్యలను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, నేషనల్‌ హైవే అధారిటీ ఆఫ్‌ ఇండియా కార్యదర్శులను కలిసి రహదారుల విస్తరణ, అభివృద్ధిపై పలుమార్లు విన్నవించారు. పేరేచర్ల- కొండమోడు (51కి.మీ), దాచేపల్లి - మాచర్ల (37కి.మీ) మార్గాలను నాలుగు వరుసల రహదార్లుగా విస్తరణ ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర విభజన హామీల్లో పొందుపరిచినవిధంగా కేంద్రం సహకారం అందించి, జాతీయ రహదార్లుగా మార్చి అభివృద్ధి చేయాలని కోరారు. విస్తరణతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టటమే కాకుండా ప్రయాణం సాఫీగా జరగటంతోపాటు స్థానిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేంద్రం ఈ రెండు ప్రధాన రహదార్లను నాలుగు వరుసల జాతీయ రహదార్లుగా మారుస్తూ ఆమోదం తెలిపింది. రహదార్ల విస్తరణకు రూ.వెయ్యి కోట్లపైనే ఖర్చుచేయనున్నది. దీనికి సంబంధించి కేంద్రం గజిట్‌ను విడుదల చేయాల్సివుంది. అనంతరం అధికారులు ప్రాజక్టు ఖర్చు అంచనాలను పూర్తిస్థాయిలో  తయారుచేయనున్నారు. వీటి పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్నాయి. నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి, రహదార్లకు మోక్షం కలగనున్నది. ప్రస్తుత తరుణంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషితో ఈ రెండుమార్గాలు జాతీయ రహదార్లుగా మార్చటం, త్వరలో విస్తరణ జరగనున్న నేపథ్యంలో వాహనదారులు, ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


పల్నాడుకు మణిహారం


పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పల్నాడు ప్రాంతానికి 37 కిలో మీటర్ల పొడువున్న దాచేపల్లి- మాచర్ల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలపటంతో ఇది నిజంగా పల్నాడుకు మణిహారం కానున్నది. ఈ రెండుమార్గాలు సక్రమంగా లేక నిత్యం ఇరుకు రహదార్లతో ఇక్కట్లు పడుతున్న పల్నాడు వాసులకు, పల్నాడు ప్రాంత కంపెనీలకు ప్రయోజనం చేకూరనున్నది. రహదార్ల విస్తరణ వల్ల పారిశ్రామికంగా రవాణా ఆలస్యం కాకుండా త్వరితగతిన అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో ఏళ్ళుగా భయం భయంగా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు ఇది ఒక వరమే.

Updated Date - 2021-03-25T05:22:47+05:30 IST