మిర్చి రైతులను ఆదుకోవాలని వినతి
ABN , First Publish Date - 2021-12-31T06:04:01+05:30 IST
తామర పురుగుతో రాష్ట్రంలో మిర్చి పంట నాశనమై తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ను కోరారు.
![మిర్చి రైతులను ఆదుకోవాలని వినతి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123112325979/12312021003319n31.gif)
గుంటూరు, డిసెంబరు 30: తామర పురుగుతో రాష్ట్రంలో మిర్చి పంట నాశనమై తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. దేశంలోనే మిరప సాగులో 25 శాతం గుంటూరు జిల్లాలో పెరుగుతుందని, 5వేల కోట్లకు పైగా టర్నోవర్తో 40కి పైగా దేశాలకు ఎగుమతి చేయబడుతుందన్నారు. ఈ సీజన్లో తెగుళ్ల బెడద, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. పురుగుల దాడులు ఎందుకు జరుగుతున్నాయో అంచనా వేయటానికి, నివారణ చర్యల గురించి రైతులకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణుల బృందాన్ని పంపాలన్నారు. జిల్లాలో పీఎం ఫసల్ బీమా యోజన సార్వత్రిక కవరేజిని ముందస్తుగా నిర్ధారించండని కోరారు. నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నష్టపోయిన పంటను సేకరించాలని కోరారు. రాష్ట్రానికి ఒక కమిటీని పంపి పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేంద్ర హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.