జింకానా సహకారంతో ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం

ABN , First Publish Date - 2021-10-30T04:45:00+05:30 IST

జీజీహెచ్‌లో మాత శిశు సంరక్షణ(ఎంసీహెచ్‌) కేంద్రం భవన నిర్మాణాన్ని జింకానా సహకారంతో పూర్తి చేయనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు.

జింకానా సహకారంతో ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం
అధికారులతో సమావేశమైన ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జీజీహెచ్‌లో మాత శిశు సంరక్షణ(ఎంసీహెచ్‌) కేంద్రం భవన నిర్మాణాన్ని జింకానా సహకారంతో పూర్తి చేయనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఏడాది వ్యవధిలో భవన నిర్మాణాన్ని అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రోడ్లు, భవనాల అతిథిగృహంలో ఇన్‌ఛార్జ్‌ మంత్రి వివిధ అంశాలపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం పనులను గత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం జీ ప్లస్‌ 3 అంతస్తులు, తర్వాత పైన మూడు అంతస్తులు జింకాన నిర్మించేలా ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే గ్రౌండ్‌ ఫోర్‌కి రూ.5.5 కోట్లు పనులు జరిగాయని, ప్రభుత్వం బిల్లులు కూడా చెల్లించిందన్నారు. ప్రస్తుతం ఎంసీహెచ్‌ భవనం మిగిలిన నిర్మాణ పనులు పూర్తిగా జింకాన చేపట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. నూతనంగా ఎంసీహెచ్‌ కేంద్రం నిర్మాణానికి పాత భవనం కూల్చి వేయడంతో కాన్పుల వార్డుని ఆరు వార్డులుగా మార్పు చేశామన్నారు. ఎంసీహెచ్‌ భవనం నిర్మాణం పూర్తి అయితే 800 నుంచి వెయ్యి బెడ్లు కాన్పులు, గైనిక్‌ వైద్య సేవల కోసం అందుబాటులోకి వస్తాయన్నారు.  సమావేశంలో  ఎమ్మెల్యేలు నంబూరి శంకరరావు, ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జాయింట్‌ కలెక్టర్లు దినేష్‌కుమార్‌, రాజకుమారి, అనుపమ అంజలి, కె.శ్రీధర్‌రెడ్డి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, జింకాన ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T04:45:00+05:30 IST