కేఎంసీ ప్రొఫెసర్‌ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-09-03T06:28:04+05:30 IST

మండల పరిధిలోని కాటూరి మెడికల్‌ కళాశాల(కేఎంసీ) ఆస్పత్రిలో కమ్యూనిటీ మెడిసిన్‌ ఫ్రొపెసర్‌ దార జగన్నాథం(61) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.

కేఎంసీ ప్రొఫెసర్‌ అనుమానాస్పద మృతి

ప్రత్తిపాడు, సెప్టెంబరు 2: మండల పరిధిలోని కాటూరి మెడికల్‌ కళాశాల(కేఎంసీ) ఆస్పత్రిలో కమ్యూనిటీ మెడిసిన్‌ ఫ్రొపెసర్‌ దార జగన్నాథం(61) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు. ఇతడు 2012 నుంచి కాటూరిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడంతో కళాశాలలోని డాక్టర్స్‌ క్వార్టర్స్‌లో ఒంటరిగా ఉంటాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం స్వీపర్స్‌ శుభ్రం చేసేందుకు క్వార్టర్‌ వద్దకు వెళ్లగా దుర్వాసన వస్తుంది. దీంతో అతడి గది తలుపు తట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఏవో శంకర్రావుకు విషయం తెలిపారు. వెంటనే వారు కిటికీ గుండా లోపల చూడగా మంచంపై విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. రెండు రోజుల క్రితమే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మూడు నెలలు సెలవు పెట్టి వారం రోజుల క్రితమే ఆయన డ్యూటీకి వచ్చారు. అయితే రెండు రోజులుగా ఆయన విధులకు హాజరు కాలేదు. గుండెపోటుతో మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నాడు. పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టంలో వచ్చిన రిపోస్టు ఆధారంగా విచారణ చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. ప్రొఫెసర్‌ గదిలో లెటర్‌తో పాటు బెడ్‌పై ఉన్న కొన్ని మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గది మొత్తం చిందర వందరగా ఉంది. భార్య కర్నూలులో ఉంటుండగా, కుమారుడు హైదరాబాద్‌లో ఉంటారని సమాచారం.  


Updated Date - 2021-09-03T06:28:04+05:30 IST