దళితులను హింసిస్తున్న ప్రభుత్వం: కనపర్తి
ABN , First Publish Date - 2021-04-16T15:19:19+05:30 IST
దళితుల ఓట్లతో అధికారంలోకి..
గుంటూరు(ఆంధ్రజ్యోతి): దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, వారిపైనే అరాచకాలు సృష్టిస్తూ, అడుగడుగునా అవమానిస్తూ, అణగదొక్కుంతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ పశ్చిమ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశం ఆయన మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి, దళిత నాయకురాలు పనబాక లక్ష్మిపై ఎగతాళిగా మాట్లాడిని మంత్రి కొడాలి నానిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని సీఎం సొంత పత్రికలో వ్యంగంగా, అవహేళనగా ముద్రించటంపై జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. దళిత విద్యార్థుల అభ్యున్నతికి చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘అంబేద్కర్ విదేశీ విద్య’ పథకానికి నిధులు కేటాయించడంలేదన్నారు. దళితుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మాజీ న్యాయమూర్తులు జడ శ్రావణ్కుమార్, రామకృష్ణలపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. శ్రావణ్కుమార్ కులం పేరుతో దూషించాడని నగరంపాలెం సీఐ ఫిర్యాదు చేయడం హేయమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పోరాటం అగదన్నారు.