ఐటీఐలో.. చేరే వారేరీ?
ABN , First Publish Date - 2021-10-29T05:49:18+05:30 IST
ఐటీఐ చదవగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేవి..
సీట్లు భర్తీ కాక యాజమాన్యాల పాట్లు
మూడుసార్లు నోటిఫికేషన్ విడుదలైనా స్పందన అంతంతమాత్రమే
ప్రైవేటు ఐటీఐల్లో భారీగా మిగిలిపోతున్న సీట్లు
గుంటూరు(విద్య), అక్టోబరు 27: ఐటీఐ చదవగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేవి.. ఇటు ఆర్టీసీ, అటు రైల్వేలోనూ ఉద్యోగాలు పుష్కలంగా ఉండేవి.. ఈ కారణంగా గతంలో ఐటీఐ కోర్సుకు భారీ డిమాండ్ ఉండేది. కానీ.. రానురాను ఈ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. తమ పిల్లలను ఇంటర్ పూర్తవగాపూ ఇంజనీరింగ్ చేయించాలనుకోవడం.. ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడం వంటి కారణాలతో ఈ వైపు విద్యార్థులు మొగ్గు చూపడం లేదు.
జిల్లాలో గుంటూరు నగరం, పొన్నూరు, నిజాంపట్నం, మాచర్ల, తెనాలి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అనేకచోట్ల్ల ప్రైవేటు ఐటీఐ కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, డ్రాఫ్ట్మెన్ సివిల్, కంప్యూటర్ ఆపరేటర్, ప్లంబర్, ఎలక్ట్రికల్, కార్పెంటర్ ఇలా దాదాపు 18 ట్రేడులు వరకు ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐటీఐ కళాశాల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అవుతున్నా ప్రైవేటు కళాశాలలో ్లభారీగా మిగిలిపోతున్నాయి. మూడు నాలుగుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా చేరేవారు కరువవుతున్నారు. అందులోనూ ఐదారు ట్రేడుల్లో మాత్రమే విద్యార్థులు చేరుతున్నారు. ఫలితంగా మిగిలిన ట్రేడులు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలో దాదాపు ఒక్కో కళాశాలలో సగటున 120 నుంచి 250 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో మినహా ప్రైవేటు కళాశాలల్లో 50శాతం కూడా సీట్లు భర్తీ కావడం లేదు.
ఉద్యోగ, ఉపాది అవకాశాలున్నా..
ఐటీఐ పూర్తిచేసిన వారికి జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని గుంటూరులోని ప్రభుత్వ ఐటీఐ, జిల్లా శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ మధుసూదనరావు ఆంధ్రజ్యోతికి వివరించారు. కోర్సులు పూర్తిచేసిన వారికి రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్, గార్డు, టెక్నికల్ అసిస్టెంట్, గ్రూప్-డి ఉద్యోగాల్లో అవకాశం ఉందని తెలిపారు.