విద్యాదీవెన పేరుతో రూ.40 వేలకు టోకరా
ABN , First Publish Date - 2021-02-26T05:35:43+05:30 IST
విద్యాదీవెన లబ్ధి అందిందా అని అడిగి ఓటీపీ తెలుసుకుని ఓ సైబర్ నేరగాడు రూ.40 వేలు కాజేసిన వైనం చిలకలూరిపేటలో చోటుచేసుకుంది.

చిలకలూరిపేట టౌన్, ఫిబ్రవరి 25: విద్యాదీవెన లబ్ధి అందిందా అని అడిగి ఓటీపీ తెలుసుకుని ఓ సైబర్ నేరగాడు రూ.40 వేలు కాజేసిన వైనం చిలకలూరిపేటలో చోటుచేసుకుంది. సంజీవనగర్కు చెందిన కారుమంచి శ్రీనివాసరావు కుమార్తె ఏఎన్యూలో పీజీ చదువుతుండగా వీరికి విద్యాదీవెన అందలేదు. గురువారం ఓ వ్యక్తి సచివాలయం నుంచి మాట్లాతున్నాను.. విద్యాదీవెన అందిందా అని ఫోన్లో ప్రశ్నించగా శ్రీనివాసరావు అందలేదని చెప్పారు. ఆయన్ను లైన్లోనే ఉంచి ఆ ప్రాంత వార్డు వలంటీర్ను లైన్లోకి తీసుకుని పథకం ఎందుకు అందలేదని వలంటీర్ను ప్రశ్నించాడు. ఇంతలో మీకు విద్యాదీవెన మంజూరైంది.. బ్యాంకు వివరాలు తెలపాలని, ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పమని ఆ వ్యక్తి శ్రీనివాసరావును అడిగాడు. ప్రభుత్వ అధికారి అడిగాడని భావించిన ఆయన రెండు సార్లు తన సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీని చెప్పారు. ఫోన్ కట్ చేసిన తర్వాత శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాలో రెండు విడతలుగా రూ.20 వేలు చొప్పున డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని అర్బన్ పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేశారు.