మృతదేహాన్ని ఇవ్వడానికి లక్షలు డిమాండ్
ABN , First Publish Date - 2021-05-08T05:45:19+05:30 IST
కరోనాతో చేరిన రోగి బంధువుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఫీజుల రూపంలో గుంజటమేకాక, రోగి మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని ఇవ్వటానికి కూడా లక్షల్లో డబ్బు డిమాండ్ చేసిన వైద్యుడు, సంబంధిత ఆస్పత్రిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు
ఆస్పత్రి, వైద్యులపై కేసు నమోదు
గుంటూరు, మే 7: కరోనాతో చేరిన రోగి బంధువుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఫీజుల రూపంలో గుంజటమేకాక, రోగి మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని ఇవ్వటానికి కూడా లక్షల్లో డబ్బు డిమాండ్ చేసిన వైద్యుడు, సంబంధిత ఆస్పత్రిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ డాక్టర్ బురదగుంట కిషోర్ ఓల్డ్క్లబ్ రోడ్డులోని పలు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా నారాయణ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహిస్తుండగా డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారం ఆయన దృష్టికి వచ్చింది. యడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన యనమదల ప్రసాద్ బంధువులు ఫణిదపు బాబు, ఆయన భార్య శివపార్వతి కరోనాతో నారాయణ ఆస్పత్రిలో చేరారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా రూ.6,93,558 చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే చికిత్స పొందుతూ భర్త మృతి చెందారు. అయితే అప్పటికే వారు రూ.2 లక్షలు చెల్లించటంతో మిగిలిన రూ.4,93,558 చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని, లేదంటే మృతదేహాన్ని మున్సిపాలిటీ వారికి అప్పగిస్తామని చెప్పారు. దీంతో మృతుని బంధువైన ప్రసాద్, వైద్యాధికారి కిషోర్ను సంప్రదించటంతో ఆయన సూచన మేరకు కొత్తపేట సీఐ రాజశేఖరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.