కొనసాగుతోన్న.. వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-21T05:21:13+05:30 IST

జిల్లాలో కొవిడ్‌-19 నివారణకు ఇచ్చే కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. కొ-విన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న 3116 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా బుధవారం సాయంత్రానికి డీఎంహెచ్‌వో కార్యాలయానికి అందిన సమాచారం మేరకు 2052 మందికి (66 శాతం) టీకాలు వేశారు.

కొనసాగుతోన్న.. వ్యాక్సినేషన్‌

బుధవారం 2052 మందికి టీకా 

వ్యాక్సినేషన్‌ సెంటర్ల సంఖ్య 43కి పెంపు 

ఇప్పటి వరకు 7652 మందికి వ్యాక్సినేషన్‌


గుంటూరు(మెడికల్‌), జనవరి 20: జిల్లాలో కొవిడ్‌-19 నివారణకు ఇచ్చే కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది.   కొ-విన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న 3116 మందికి టీకాలు  వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా బుధవారం సాయంత్రానికి డీఎంహెచ్‌వో కార్యాలయానికి అందిన సమాచారం మేరకు 2052 మందికి (66 శాతం) టీకాలు వేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆసుపత్రులు వంటి 31 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా, బుధవారం ఈ కేంద్రాల సంఖ్యను 43కు పెంచా రు. కొన్ని చోట్ల కొ-విన్‌ యాప్‌లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యలు, లబ్ధిదారుల సెల్‌ఫోన్లకు ఆలస్యంగా సమాచారం వెళ్లడం, కొందరు వ్యక్తిగత పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉండటం వంటి కారణాల వల్ల ఆశిం చిన దాని కంటే కొద్దిగా తక్కువగానే వ్యాక్సినేషన్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో టీకాల కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఇప్ప టి వరకు 13.358 మందిని టీకాల కోసం కేంద్రాలకు ఆహ్వానించగా, 7652 మంది వ్యాక్సినేషన్‌ చేయించుకున్నారు. అత్తలూరు, నకరికల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం ఒక్కరు కూడా టీకాలు వేయించుకోలేదు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో 85 శాతం, చండ్రాజుపాలెం పీహెచ్‌సీలో 93 శాతం, బొల్లాపల్లిలో 90 శాతం వ్యాక్సి నేషన్‌ నమోదైంది. గుంటూ రు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో 54 శాతం టీకాలు వేశారు. బుధవారం జరిగిన టీకాల కార్యక్రమాన్ని అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయసింహా, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌, జిల్లా క్షయ నియంత్రాణాధికారి డాక్టర్‌ టీ రమేష్‌ తదితరులు పరిశీలించారు. మేడికొండూరు పీహెచ్‌సీలో డాక్టర్‌ రమేష్‌ సిబ్బందికి టీకా వేశారు.


వచ్చే వారం నుంచి ప్రైవేటు వైద్యులకు...

ఇప్పటి వరకు జిల్లాలోని ప్రభుత్వ వైద్య రంగంలో పని చేస్తున్న సిబ్బందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తున్నారు. వచ్చే వారం నుంచి ప్రైవేటు వైద్యరంగంలోని డాక్టర్లు, పారా మెడికల్‌, సహాయక సిబ్బందికి టీకాల కార్యక్రమం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల సంఖ్యను కూడా పెంచనున్నారు.  వైద్య సిబ్బందికి ముగిసిన తర్వాత సాధారణ ప్రజల్లో 50 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తారు.


జిల్లాకు మరో 35 వేల డోసులు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు బుధవారం మరో 35 వేల డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్లు చేరకున్నాయి. గతంలో 43,500 టీకాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద 78,500 మోతాదుల వ్యాక్సిన్‌ నిల్వలు చేరినట్లైంది. పలు పీహెచ్‌సీలకు 500 డోసుల చొప్పున పంపిణీ చేయగా, డీఎంహెచ్‌వో కార్యాల యంలో 11 వేల డోసులు నిల్వ ఉన్నాయి. 


19 మందికి కరోనా.. ఒకరి మృతి

గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం ఉదయం వరకు విడుదలైన 5,154 శాం పిల్స్‌ ఫలితాల్లో 19 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మిగతా 5,135(99.63 శాతం) మందికి నెగిటివ్‌గా తేలింది. కొత్తగా గుం టూరు నగరంలో 9, కొల్లిపరలో 2, మంగళగిరి, పెద కాకాని, ఫిరంగిపురం, పెదనందిపాడు, చిలకలూ రిపేట, అమర్తలూరు, చెరుకుపల్లి, నగరం మండలా ల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 76,957కి చేరుకోగా వారిలో 75,977 మంది 98.73 శాతం మంది కోలుకున్నారు. ప్రస్తుతం 248 మంది చికిత్స పొందుతోండగా బుధవారం మరో మరణం చోటు చేసుకుంది. దీంతో మృతుల సంఖ్య 732కి పెరిగిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు 5,671 మంది శాంపిల్స్‌ని సేకరించారు. 

Updated Date - 2021-01-21T05:21:13+05:30 IST