మిస్టరీగా నేవీ ఉద్యోగి అదృశ్యం
ABN , First Publish Date - 2021-06-11T06:40:52+05:30 IST
మలేషియాలోని చినర్జీ అనే నేవీ కంపెనీలో చీఫ్ ఆఫీసర్గా పని చేసే గుంటూరుకు చెందిన కాకర్ల శ్రీనివాసరావు(30) అదృశ్యం మిస్టరీగా మారింది.
మలేషియాలో చీఫ్ ఆఫీసర్గా విధులు
స్నేహితుడు, ప్రేమికురాలిపై ఎస్పీకి కుటుంబ సభ్యుల ఫిర్యాదు
గుంటూరు, జూన్ 10: మలేషియాలోని చినర్జీ అనే నేవీ కంపెనీలో చీఫ్ ఆఫీసర్గా పని చేసే గుంటూరుకు చెందిన కాకర్ల శ్రీనివాసరావు(30) అదృశ్యం మిస్టరీగా మారింది. మలేషియా నుంచి యూఎస్ ఓడ వెళుతున్న క్రమంలో గత నెల 24న నుంచి శ్రీనివాసరావు కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై ఇటీవల డొంకరోడ్డుకు చెందిన శ్రీనివాసరావు తండ్రి సుబ్బరాయుడు అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో గురువారం అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్కు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు అన్న కాకర్ల వెంకటేష్, వదిన శివపార్వతి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసరావు 2015 నుంచి మలేషియాలో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీనివాసరావు గత సెప్టెంబరులో గుంటూరు వచ్చి వెళ్లాడు. గత నెల 24న ఉదయం ఓడలో టిఫిన్కు సిబ్బంది హాజరుకావాల్సి ఉండగా శ్రీనివాసరావు కనిపించలేదు. సిబ్బంది గాలించగా అతడి కంప్యూటర్ వద్ద టైప్ చేసిన ఓ లెటరు కనిపించిందని, అందులో తాను తీవ్రంగా గాయపడితే వైద్యం చేయించాలని, మృతి చెందితే మృతదేహం గుంటూరు పంపాలని రాసి ఉన్నట్టు కుటుంబ సభ్యులకు తెలిసింది. 24న కంపెనీ వారు తనకు ఫోను చేసి శ్రీనివాసరావు కనిపించటం లేదని చెప్పారని, గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు స్నేహితుడు రాజేంద్ర అదే రోజు రాత్రి సోదరుడు వెంకటేష్, తండ్రికి ఫోను చేసి చెప్పాడు. దీంతో 25న వెంకటేష్ ఫోను చేసి విచారించగా కంపెనీ నుంచి తనకు ఫోను వచ్చిందని, లెటర్లో ప్రేమికురాలు రేవతి పేరు, ఫోను నెంబరు రాసి తాను చనిపోతే మొబైల్, ల్యాప్టాప్ రేవతికి అందించాలని ఉన్నట్టు రాజేంద్ర చెప్పాడు. దీంతో వెంకటేష్ పేర్కొన్న నెంబరుకు ఫోను చేయగా తాను విశాఖలో ఉంటానని, శ్రీనివాసరావు తను ప్రేమించుకున్నామని, సెలవులకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందామనుకున్నామని రేవతి చెప్పింది. ఆ తర్వాత కంపెనీ వారు చెన్నై నుంచి ఫోను చేసి ఓడ ఈనెల 20కి యూఎస్కు చేరుకుంటుందని, అక్కడికి వెళ్లాక తమ కంపెనీ ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు చెబుతామని చెప్పారన్నారు. ఓడలో ప్రయాణిస్తున్న వారి నుంచి ఎటువంటి సమాచారం లేదని శ్రీనివాసరావు కుటుంబసబ్యులు తెలిపారు. వారు రాజేంద్రతోనే మాట్లాడుతున్నారని సోదరుడు వెంకటేష్ పేర్కొన్నారు. రాజేంద్ర, రేవతిలపైనే తమకు అనుమానం ఉందన్నారు. అంతేగాక నెలరోజుల క్రితం ఎస్వీఎన్ కాలనీలోని అపార్టుమెంటులోని ఫ్లాట్ను ఖాళీ చేసి విద్యానగర్లోని మరో ఫ్లాట్కు రాజేంద్ర సామాను మార్చాడన్నారు. అరండల్పేట పోలీసులు రాజేంద్రను పిలిపించి ఆయనకు అనుకూలంగా మాట్లాడారన్నారు. రాజేంద్ర, రేవతిలను అదుపులోకి తీసుకుని విచారిస్తే తమ సోదరుడి మిస్సింగ్ మిస్టరీ వీడిపోతుందని వెంకటేష్ అర్బన్ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం ఓ వ్యక్తి తనకు ఫోను చేసి తాను విశాఖ ఎంవీపీ పోలీస్స్టేషన్ సీఐని అని వారిద్దరికి తొమ్మిదేళ్ల క్రితమే వివాహమైందని, రేవతి పేరుతో ఇన్సెంటివ్ బాండు, బ్యాంకు అకౌంట్ కూడా ఉందని, అటువంటిది ఆమెను ఎందుకు బయటకు లాగులున్నారంటూ ఫోను చేసి బెదిరిస్తున్నారని వెంకటేష్ విలేకర్లకు తెలిపారు. ఫిర్యాదును విచారించాల్సిందిగా వెస్టు డీఎస్పీ సుప్రజను అర్బన్ ఎస్పీ ఆదేశించారు.