పన్నుల పెంపుపై అభ్యర్థులను నిలదీయాలి
ABN , First Publish Date - 2021-02-27T06:01:30+05:30 IST
ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను నిర్ణయించే విధానాన్ని నిరసించాలని, దీనిపై జీఎంసీ కార్పొరేటర్ అభ్యర్థులను ప్రజలు నిలదీయాలని సిటీ నాన్ రెసిడెన్షియల్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ తెలిపారు.
గుంటూరు, ఫిబ్రవరి 26: ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను నిర్ణయించే విధానాన్ని నిరసించాలని, దీనిపై జీఎంసీ కార్పొరేటర్ అభ్యర్థులను ప్రజలు నిలదీయాలని సిటీ నాన్ రెసిడెన్షియల్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ తెలిపారు. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ అవగాహన సంస్థ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజాసభలో ఆయన మాట్లాడారు. కరోనాతో అన్ని రంగాలు కుదేలై అధోగతిలో ఉన్న పరిస్థితుల్లో ఆస్తి పన్ను రెండు, మూడు రెట్లు పెంచడం సరికాదని తెలిపారు. ఆస్తిపన్ను పెంపు వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి ఎల్ఎస్ భారవి మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా, అశాస్త్రీయంగా ఆస్తి పన్నులు పెంచితే ప్రజలు సహించబోరన్నారు. సభలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్, సీనియర్ న్యాయవాది కేవీ సుబ్బారావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.