వెలగపూడి హత్య కేసులో మరో 11 మంది అరెస్టు
ABN , First Publish Date - 2021-01-20T05:33:16+05:30 IST
రాజధాని పరిధిలోని వెలగపూడి దళిత కాలనీలో గత నెల 27న రాత్రి జరిగిన దళిత మహిళ మెండెం మరియమ్మ అలియాస్ బుజ్జి (50) హత్య కేసులో మరో 11 మందిని అరెస్టు చేశారు.

గుంటూరు, జనవరి 19: రాజధాని పరిధిలోని వెలగపూడి దళిత కాలనీలో గత నెల 27న రాత్రి జరిగిన దళిత మహిళ మెండెం మరియమ్మ అలియాస్ బుజ్జి (50) హత్య కేసులో మరో 11 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రూరల్ సీసీఎస్ అదనపు ఎస్పీ ఎన్వీఎస్ మూర్తి నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. వెలగపూడి దళిత కాలనీలో ఆర్చి ఏర్పాటు విషయమై ఇరువర్గాల మధ్య నెలకున్న వివాదంలో మరియమ్మ మృతి చెందిన కేసులో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సహా మొత్తం 77 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూరల్ ఎస్పీ విశాల్గున్నీ కేసు దర్యాప్తునకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ఏడుగురిని అరెస్టు చేయగా తాజాగా ప్రధాన నిందితుడైన సలివేంద్ర రాంబాబు, సలివేంద్ర బంగారయ్య, సలివేంద్ర మాధవరావు, సలివేంద్ర ప్రసాద్ అలియాస్ యాకోబు, సలివేంద్ర రూబెన్ అలియాస్ విజయరావు, సలివేంద్ర నాగేశ్వరరావు, సలివేంద్ర ఏసోబు, సలివేంద్ర నాగరాజు, సలివేంద్ర శ్రీకాంత్, సలివేంద్ర చక్రవర్తి అలియాస్ శంకర్బాబు, సలివేంద్ర జ్ఞానసుందరరావులను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామని మూర్తి తెలిపారు. ఈ కేసులో నిందితుడైన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పాత్రపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఎంపీ పాత్రపై విచారణ జరుగుతోందని తెలిపారు. సమావేశంలో తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ దుర్గాప్రసాద్, పెదకూరపాడు సీఐ తిరుమలరావు, తుళ్లూరు ఎస్ఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.