పెట్రో ధరలను వెంటనే తగ్గించాలి
ABN , First Publish Date - 2021-06-12T06:07:57+05:30 IST
కరోనా మహమ్మారితో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పెట్రోధరలను పెంచి నిలువు దోపిడీ చేస్తున్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి ధ్వజమెత్తారు.
ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి
గుంటూరు, జూన్ 11: కరోనా మహమ్మారితో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పెట్రోధరలను పెంచి నిలువు దోపిడీ చేస్తున్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి ధ్వజమెత్తారు. పెంచిన పెట్రో ధరలను నిరసిస్తూ గుంటూరులో పెట్రోల్బంకు ఎదుట మస్తాన్వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఇతర నాయకులు ధర్నాచేసి నిరసన తెలియజేశారు. ప్రజలు నిత్యావసర సరుకులు కూడా కొనలేని స్థితిలో ఉంటే పెట్రో ధరలు పెంచటం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ అసెంబ్లీలో పెట్రో ధరలపై ఆందోళన చేశారని, ధరలు పెరిగిన తరుణంలో ఇప్పుడు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. ఇద్దరూ లోపాయికారి ఒప్పందంతో ప్రజలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పెట్రో ధరలను ప్రజలకు అందుబాటులో ఉంచామని ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయని విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించకపోతే ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ వెంటనే పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కొరివి వినయ్కుమార్, అడవి ఆంజనేయులు, గడ్డం పాల్విజయ్కుమార్, తవిడిశెట్టి మోహన్రావు, బ్రహ్మం, జానీ, మోషే, కరీం, బన్నీ, తన్నీరు సాంబయ్య, వెంకటరెడ్డి తదితరులున్నారు.