పెళ్లికార్డులు పంచివస్తూ.. ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-11-26T06:06:47+05:30 IST

ఆమెది ఏలూరు. కుమార్తె పెళ్లి కుదిరింది. బంధువులకు కార్డులు పంచేందుకు గుంటూరు వచ్చిన ఆమె సోదరుడితో కలిసి నరసరావుపేట వెళ్లి వస్తుంది.

పెళ్లికార్డులు పంచివస్తూ.. ఇద్దరి దుర్మరణం
బోల్తాపడిన ఇటుకల లోడు లారీ

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్ని లారీ.. అన్నాచెల్లెలు మృతి 

మేడికొండూరు, నవంబరు 25: ఆమెది ఏలూరు. కుమార్తె పెళ్లి కుదిరింది. బంధువులకు కార్డులు పంచేందుకు గుంటూరు వచ్చిన ఆమె సోదరుడితో కలిసి నరసరావుపేట వెళ్లి వస్తుంది. ద్విచక్ర వాహనంపై వస్తున్న వీరిని మండలంలోని పేరేచర్ల సమీపంలో గురువారం ఇటుకల లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో గుంటూరుకి చెందిన బండుచోడ నాగరాజు(47), ఆయన సోదరి జీ పార్వతి(45) మృతి చెందగా అదుపుతప్పిన లారీ బోల్తా పడటంతో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు శివరాజు కాలనీకి చెందిన బండుచోడ నాగరాజు, ఏలూరుకు చెందిన చెల్లెలు పార్వతితో కలసి ద్విచక్ర వాహనంపై నరసరావుపేటకు వెళ్లి పెళ్లి కార్డులు పంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. మార్గమధ్యలో పేరేచర్ల సమీపంలోని యూనివర్సల్‌ కళాశాల వద్ద ఎదురుగా వస్తున్న ఇటుకల లోడు లారీ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో అన్నా చెల్లెలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన పల్లంలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఇటుకల లోడు దించేందుకు అదే లారీలో ప్రయాణిస్తున్న నలుగురు కార్మికులు కింద పడి గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   లారీ డ్రైవర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ తెలిపారు. 

 

Updated Date - 2021-11-26T06:06:47+05:30 IST