యానాంలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిధ్ధం
ABN , First Publish Date - 2021-05-02T06:53:20+05:30 IST
యానాం నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ ఆరో తేదీన యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఓట్లు లెక్కించనున్నారు.
![యానాంలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిధ్ధం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921050201204997/05022021012252n42.jpeg)
- తొలుత పోస్టల్ బ్యాల్ట్ లెక్కింపు
- 8 గంటల నుంచి ప్రారంభం
- 15 రౌండ్ల్లో లెక్కింపు
- 5 బూత్ల్లో వీవీప్యాడ్ ఓట్లు లెక్కింపునకు ఏర్పాట్లు
యానాం, మే 1: యానాం నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ ఆరో తేదీన యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఓట్లు లెక్కించనున్నారు. యానాం నియోజకవర్గంలో 37,811మంది ఓటర్లు ఉండగా 34,390 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 16,764మంది, మహిళలు 17,626మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల తర్వాత ఈవీఎంలను స్థానిక మినీ సివిల్ స్టేషన్లోని స్ర్టాంగ్రూమ్లో భద్రపర్చారు. స్ట్రాంగ్రూమ్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి పర్యవేక్షణతోపాటు కేంద్ర పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. స్థానిక మినీ సివిల్ స్టేషన్లోని సమావేశపు హాల్లో ఆదివారం ఉదయం 8గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. యానాంలోని 60 పోలింగ్ బూత్లకు సంబంధించి ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక టేబుల్ పోస్టల్ బ్యాలెట్కు కేటాయించారు. మిగిలిన నాలుగు టేబుళ్లలో 15 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం ఐదు పోలింగ్ బూత్లకు సంబంధించి వీవీప్యాట్లలోని ఓట్లు లెక్కిస్తారు. ఒక వీవీప్యాట్లోని ఓట్ల లెక్కింపునకు గంట సమయం పడుతుంది. కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి అమన్శర్మ పరిశీలించారు. స్థానిక మినీ సివిల్ స్టేషన్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎస్పీ శంకర్ వెల్లాట్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహిస్తారు.