పోతవరంలో రూ.4.70లక్షల సొత్తు చోరీ
ABN , First Publish Date - 2021-10-24T07:05:38+05:30 IST
తాళం వేసి ఉన్న ఒక పూజారి ఇంట్లో రూ.4.70లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. మండలంలోని పోతవరానికి చెందిన ఖండవల్లి వెంకటసత్యనారాయణ ఇంటికి తాళం వేసి భార్య రుక్మిణితో కలిసి ఈనెల4న రాజమహేంద్రవరంలోని కుమార్తె ఇంటికి వెళ్లారు.
పి.గన్నవరం, అక్టోబరు 23: తాళం వేసి ఉన్న ఒక పూజారి ఇంట్లో రూ.4.70లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. మండలంలోని పోతవరానికి చెందిన ఖండవల్లి వెంకటసత్యనారాయణ ఇంటికి తాళం వేసి భార్య రుక్మిణితో కలిసి ఈనెల4న రాజమహేంద్రవరంలోని కుమార్తె ఇంటికి వెళ్లారు. ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలుగొట్టి ఉండడంతో ఒక యువకుడు సత్యనారాయణకు సమాచారం ఇచ్చాడు. చెన్నకేశవస్వామికి చెందిన 650 గ్రాములు విలువైన మూడు వెండి కిరీటాలు, 1,350 గ్రాముల వెండి వస్తువులు, ఎనిమిదిన్నర కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు సత్యనారాయణ తెలిపారు. ఎస్ఐ జి.సురేంద్ర అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. అమలాపురం నుంచి క్లూస్టీమ్ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, పరమేష్ప్రసాద్ వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఇక్కడకు కూతవేటు దూరంలో ఉన్న నందెపు శ్యామలరావు అనే వ్యక్తి ఇంట్లో కూడా చోరీ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. కుటుంబసభ్యులు హైదరాబాదులో ఉండడంతో ఆ ఇంటిని ఆదివారం పరిశీలిస్తామని, ఆ ఇంట్లో కారం చల్లి ఉన్నట్టు క్లూస్ టీమ్ సభ్యులు తెలిపారు.