ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-20T05:21:06+05:30 IST

మండలంలోని ఎంపీటీసీలు ప్రజల సమస్యలు తెలుసుకొని అవగాహన పెంచుకొని పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి సూచించారు.

ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి

  • అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి
  • రంగంపేట మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం

రంగంపేట, డిసెంబరు 19: మండలంలోని ఎంపీటీసీలు ప్రజల సమస్యలు తెలుసుకొని అవగాహన పెంచుకొని పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి సూచించారు. మండల పరిషత్‌ సర్వ సభ్య సమావేశం ఆదివా రం ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపీపీ ఆర్‌.శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మండలంలో అధికార పక్షం, ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించాలని, ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేయాలన్నారు. ఓటీఎస్‌ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గత ప్రభుత్వ హయాంలో రుణాలు తీసుకున్న వారి ఖాతాల్లో బాకీలు పెరిగిపోతున్నాయని, వాటిని తీర్చడానికి ఈ పథకం ఏర్పాటుచేశామన్నారు. మండలంలో 2700 మంది లబ్ధిదారులు ఉండగా 1200 మంది ఓటీఎస్‌లో సొమ్ము చెల్లించడంపై అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. మండలంలో గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిషన్‌ విషయంలో రూ.80 లక్షల మేర అక్రమాలు జరిగాయని, ఆ రికార్డులు టాంపరింగ్‌ జరగకుండా అధికారులు పరిరక్షించాలని, త్వరలో వీటిపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. 

రోడ్లపై గోతులు పూడ్చకపోతే నిరాహర దీక్ష: జడ్పీటీసీ

 మండలంలోని ఆర్‌అండ్‌బీకి చెందిన రోడ్లు పూర్తిగా పాడైపోయాయని, పెద్ద పెద్ద గోతులతో వాహనదారులలు ఇబ్బందులు పడుతున్నారని, వీటికి మరమ్మతులు చేపట్టి పూడ్చకపోతే నిరాహర దీక్ష చేపడతానంటూ జడ్పీటీసీ పి.రామచంద్రరావు.. ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ను హెచ్చరించారు. పలు రోడ్లు గోతులు పడ్డాయని పలువురు ప్రమాదంలో గాయపడ్డారంటూ జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు లంక చంద్రన్న ఏఈకి వివరించారు. సమావేశంలో ఎంపీడీవో కెఎస్‌ఎస్‌ సుబ్బారావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T05:21:06+05:30 IST