బాణసంచా నిల్వలపై పోలీసుల దాడులు
ABN , First Publish Date - 2021-10-19T05:34:19+05:30 IST
పిఠాపురం మండలం చిత్రాడలో స్పెషల్ బ్రాంచి పోలీసులు దాడులు నిర్వహించి అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.2 లక్షలకు పైగా విలువైన బాణసంచా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పిఠాపురం రూరల్, అక్టోబరు 18: పిఠాపురం మండలం చిత్రాడలో స్పెషల్ బ్రాంచి పోలీసులు దాడులు నిర్వహించి అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.2 లక్షలకు పైగా విలువైన బాణసంచా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ ఇన్చార్జి డీఎస్పీ బోను అప్పారావు సోమవారం విలేకర్లకు వివరాలు వెల్లడించారు. చిత్రాడ గ్రామంలోని మొక్కతోట దుర్గమ్మవీధిలో ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా అక్రమంగా బాణసంచా, మందుగుండు సామగ్రి నిల్వ ఉంచినట్టు అందిన సమాచారంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబు ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచి సీఐ రమణ, పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాసరావు, ఎస్ఐ శంకరరావు తనిఖీలు నిర్వహించారు. అక్కడ లైసెన్సులు లేకుండా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచినట్టు గుర్తించారు. శివకాశీ దీపావళి, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ1.62 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మార్కెట్ విలువ రూ.4 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఈ సంఘటనకు సంబంధించి కేదారశెట్టి వెంకటేశ్వర్లు, సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నివాసాల మధ్య బాణసంచా, మందుగుండు సామగ్రి నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.