తవ్వకాలకు ఒప్పుకోం!
ABN , First Publish Date - 2021-08-03T06:05:28+05:30 IST
అమలాపురం (ఆంధ్రజ్యోతి): కపిలేశ్వరపురం గ్రామ శివారు నారాయణలంకలో బొండు ఇసుక తవ్వకాలపై వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు స్పందించారు. వేర్వేరుగా ఇసుక తవ్వుతున్న నారాయణలంక ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఆంధ్రజ్యోతిలో ‘ఇసుక పక్కదారి’ శీర్షికన వార్తా కథనం సోమవారం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు

గ్రామస్తులకు నచ్చజెప్పే యత్నం చేసిన ఎమ్మెల్సీ తోట
ఎస్ఈబీ అధికారుల బృందం ఆర్డీవోతో కలసి పరిశీలన
వాడపాలెం పంచాయతీ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం
‘ఆంధ్రజ్యోతి’ వార్తకు స్పందన
అమలాపురం (ఆంధ్రజ్యోతి): కపిలేశ్వరపురం గ్రామ శివారు నారాయణలంకలో బొండు ఇసుక తవ్వకాలపై వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు స్పందించారు. వేర్వేరుగా ఇసుక తవ్వుతున్న నారాయణలంక ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఆంధ్రజ్యోతిలో ‘ఇసుక పక్కదారి’ శీర్షికన వార్తా కథనం సోమవారం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాన్ని అమలాపురం ఆర్డీవో ఎన్ఎస్వీబీ వసంత రాయుడుతోపాటు ఎస్ఈబీ అధికారుల బృందం సందర్శించింది. ఇసుక తవ్వకాలు ఏ రీతిన జరుగుతున్నాయి, ఎంతమేర జరుగుతున్నాయన్న దానిపై ఎస్ఈబీ బృందంతోపా టు ఆర్డీవో విచారణ జరిపారు. గ్రామస్తులు తమ ఆవేదనను అధికారుల బృందం ముందు వ్యక్తంచేశారు. ఇష్టానుసారంగా నారాయణలంక ప్రాంతాన్ని తవ్వేస్తే తమ గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆర్డీవో ముందు ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాడపాలెం వంతెనపై భారీ ఇసుక వాహనాలు ప్రయాణించడం వల్ల వంతెనకు ముప్పు పొంచి ఉందని ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. స్థానికులు చెప్పిన విషయాలను ఆర్డీవో విన్నారు. ఇటు 80 లారీలకు అధికారికంగా ఇసుక రవాణాకు అను మతిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇక వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నారాయణ లంకలోని ఇసుక తవ్వకం జరిగిన ప్రాంతానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఆయన ఎదుట తీవ్ర ఆరోపణలు సంధించారు. కొంచెం దూరం గా ఉన్న ప్రాంతం నుంచి ఇసుక తవ్వుకునేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ తోట చెప్పినా వారంతా ససేమిరా అని మొండికేశారు. వాడపాలెం గ్రామస్తులు నారాయణలంక ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు. సర్పంచ్ త్సామా బాబు అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించి వాడపాలెం వంతెనకు ముప్పు పొంచి ఉండడంతోపాటు నారాయణలంక, వాడపాలెం లంకలకు ప్రమాదం తీవ్రమయ్యే సూచనలుండడంతో తవ్వకాలు నిలిపి వేయాల్సిందిగా పంచాయతీ తీర్మానం చేశారు.