వైసీపీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి..

ABN , First Publish Date - 2021-03-22T06:04:26+05:30 IST

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అరాచక పాలనపై ప్రజలు చైతన్యమయ్యే రోజు దగ్గరలోనే ఉందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

వైసీపీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి..
రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తున్న నేతలు

మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప 

అనపర్తి, మార్చి 21: రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అరాచక పాలనపై ప్రజలు చైతన్యమయ్యే రోజు దగ్గరలోనే ఉందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆదివారం టీడీపీ నేతలు రాజప్ప, జవహర్‌ పరామర్శించారు. అనంతరం రాజప్ప మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలను బయట పెట్టినందుకే రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని చెప్పారు. పోలీసుల సహకారంతో టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు కెఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ అనపర్తిలో గృహిణి అరుణకుమారి తన మరణానికి స్థానిక ఎమ్మెల్యే కారకుడని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడినా ఎమ్మెల్యేపై నేటికీ కేసు నమోదు  కాలేదన్నారు. అరుణకుమారి మరణం వెనుక ఉన్న కారణం ఏమిటనేదానిపై నేటికీ పోలీసులు విచారణ చేయలేదని అన్నారు. ఆమె పోస్టుమార్టం రిపోర్టులు నేటికీ రాలేదని, కానీ రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి  రిపోర్టులు మాత్రం ఇంత త్వరగా రావడానికి కారణాలు కూడా నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్యే వేగేళ్ల జోగేశ్వరరావు, బండారు సత్యానందరావు, వల్లూరి నారాయణరావు, సిరససల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T06:04:26+05:30 IST