నటుడిగా జన్మించింది.. రాజమండ్రిలోనే

ABN , First Publish Date - 2021-10-02T06:59:30+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 1: రాజమండ్రికి ఎప్పుడొచ్చినా గత స్మృతులు నన్ను వెంటాడుతుంటాయి. అవి చెప్పుకోవాలనిపిస్తుంది. ఎక్కడ జన్మించానో పక్కనబెడితే నటుడిగా జన్మించింది ఈ గడ్డమీదే అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. అల్లు రామలింగయ్య శతజ

నటుడిగా జన్మించింది.. రాజమండ్రిలోనే
అల్లు రామలింగయ్య హోమియో కళాశాలలో రూ.2 కోట్ల ఎంపీ నిధులతో నిర్మించిన కళాశాల భవనాన్ని ప్రారంభిస్తున్న చిరంజీవి, అరవింద్‌, మురళీమోహన్‌ తదితరులు

ఇక్కడకొస్తే గత స్మృతులు వెంటాడతాయి.. థ్యాంక్యూ రాజమండ్రి

మామా అల్లుళ్ల బంధమేకాదు, గురుశిష్యుల అనుబంధం మాది

అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహావిష్కరణలో మెగాస్టార్‌ చిరంజీవి

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 1: రాజమండ్రికి ఎప్పుడొచ్చినా గత స్మృతులు నన్ను వెంటాడుతుంటాయి. అవి చెప్పుకోవాలనిపిస్తుంది. ఎక్కడ జన్మించానో పక్కనబెడితే నటుడిగా జన్మించింది ఈ గడ్డమీదే అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. అల్లు రామలింగయ్య శతజయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమి యో వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. అలాగే రూ.2 కోట్ల నిధులతో నిర్మించిన కళాశాల అదనపు భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల సెమినార్‌ హాలులో హోమియో వైద్య విద్యార్థులనుద్దేశించి చిరంజీవి మాట్లాడారు. తొలి సినిమా ‘పునాదిరాళ్లు’ కోసం మొఖానికి మేకప్‌ వేసుకున్నది రాజమండ్రిలోనే, నా నటజీవితానికి పునాదిరాళ్లు పడింది ఇక్కడే అని అన్నారు. ఒక్క పునాదిరాళ్లే కాదు, రెం డవ సినిమా ‘ప్రాణం ఖరీదు’, మూడవ సినిమా ‘మన ఊరి పాండవులు’ అన్నీ కూడా రాజమండ్రి, చుట్టుపక్కలే జరిగాయి. నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఇక్కడుండే మనుషులు, నీరు, గాలి, నేలతో తెలియని ఉత్తేజానికి లోనయ్యాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఇక్కడకు రావడం అంతే ఉత్తేజానికి లోనవుతున్నాను, థ్యాంక్యూ రాజమండ్రి అని మెగాస్టార్‌ వ్యాఖ్యానించారు.


అల్లు హాస్యాన్ని పండించినా..నిజజీవితాన్ని సీరియస్‌ తీసుకున్నారు..

అల్లు రామలింగయ్యది, తనది మామ, అల్లుళ్ల బంధమే కాదు, గురుశిష్యుల అనుబంధమని చిరంజీవి అన్నారు. సినిమా జీవితంలో అల్లు రామలింగయ్య హాస్యాన్ని పండించారేమో కానీ నిజజీవితాన్ని సీరియస్‌గా తీసుకుని మహోన్నత వ్యక్తిగా ఎదిగారని, పద్మశ్రీగా నిలిచారని పేర్కొన్నారు. అల్లు రామలింగయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫిలాసఫీ, ప్రముఖుల జీవితంలోని అద్భుత సంఘటనలు, హోమియోపతి ఏది చెప్పినా వావ్‌ అంటూ శ్రోతనై ఉండిపోయేవాడినని అన్నారు. రామలింగయ్యతో మొట్టమొదటి పరిచయం కాకతాళీయంగా రాజమండ్రిలోనే ‘మన ఊరిపాండవులు’ చిత్రంతోనే పరిచయం అయ్యిందన్నారు. ఆరోజే ఆయన ప్లాన్‌ చేశారేమో ఈ అబ్బాయి బాగున్నాడు, మంచి గుణవంతుడు, మనం నొక్కేసి ఇంట్లో ఉంచుకుందాం అనుకున్నారేమో తెలీదు అని చిరు చమత్కరించారు. అందరూ అల్లు రామలింగయ్యను ఒక హాస్యనటుడు అనుకుంటారుకానీ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయ నకు తెలియని విషయాలు ఉండవని అన్నారు. పట్టుదలకు పరాకాష్ట అని, అనుకున్నది సాధిస్తారన్నారు. అనుకున్నది సాధించి పద్మశ్రీ అవార్డు పొందారని అన్నారు. నటుడుగా సాధించిన దానితో తృప్తి చెందకుండా హోమియోపతి మక్కువతో నేర్చుకోవాలనే పట్టుదలతో బాగా చదువుకుని, పరీక్షలు రాసి ఆర్‌ఎంపీ ఇన్‌ హోమియోపతిగా సర్టిఫై అయ్యారన్నారు. నిత్యవిద్యార్థిలా ఉన్నత శిఖరాలకు చేరి పద్మశ్రీ అందుకున్న అల్లు రామలింగయ్య జీవితాన్ని విద్యార్థులు ఒక గుణపాఠంగా తీసుకోవాలన్నారు. హోమియోపతిలో ప్రతి జబ్బుకు మందు ఉందని, అయితే ఆ జబ్బు గురించి పేషెంట్‌ కరెక్టుగా చెప్పగలగాలని అన్నారు. రాజ్యసభ ఎంపీ కావడం తన అదృష్టమని, రాష్ట్రంలో ఎక్కడైనా నిధులిచ్చే అవకాశం ఉండంతో రూ.2 కోట్లు కాలేజీ భవన నిర్మాణానికి ఇచ్చా నని, తన జేబులో డబ్బులు కాదని చిరంజీవి అన్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్‌, రామలింగయ్య పెద్దల్లుడు డాక్టర్‌ వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్‌ సూర్యభగవాన్‌ మాట్లాడారు. హోమియో వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-02T06:59:30+05:30 IST