విరిగిన కోరుకొండ నరసన్న ఆలయ ధ్వజస్తంభం
ABN , First Publish Date - 2021-06-01T07:06:34+05:30 IST
వెయ్యేళ్లకు పైగా చారిత్రిక నేపథ్యం కలిగి రాష్ట్రంలో నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దిగువ దేవస్థానం ప్రధాన ఆలయంవద్ద ధ్వజస్తంభం సోమవారం ఉదయం విరిగిపడింది.
కోరుకొండ, మే 31: వెయ్యేళ్లకు పైగా చారిత్రిక నేపథ్యం కలిగి రాష్ట్రంలో నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దిగువ దేవస్థానం ప్రధాన ఆలయంవద్ద ధ్వజస్తంభం సోమవారం ఉదయం విరిగిపడింది. రెండేళ్లుగా ఈ ధ్వజ స్తంభం పైభాగం కొంతమేర ఒరుగు చూసింది. ఈ విషయాన్ని దేవస్థానం కార్యనిర్వాహకులుగా ఉన్న అన్నవరం దేవస్థానం అధికారులకు గ్రామస్థులు తెలియజేశారు. అధికారులు ఉదాసీన వైఖరి అవలంబించారు. ఇదే విషయంపై మూడు నెలల ముందే ఆంధ్రజ్యోతి ధ్వజస్తంభం ఒరిగింది.. చర్యలు తీసుకోండి అంటూ ఫొటోలతో కథనాలు ప్రచురించింది. ఈ విధంగా ధ్వజ స్తంభం విరిగిపడడం మంచిది కాదని, దీనికి మహాసంప్రోక్షణ కార్యక్రమాలు చేయాలని పలువురు ఆగమ పండితులు సూచిస్తున్నారు.
అన్నవరం దేవస్థానం అధికారుల పరిశీలన..
విరిగిపడిన ధ్వజస్తంభాన్ని సోమవారం సాయంత్రం అన్నవరం దేవస్థానం అధికారులు పరిశీలించారు. సంవత్సర కాలంక్రితంనుంచి ధ్వజ స్తంభానికి అనువైన సోమెత కర్ర కోసం వెతుకుతున్నామని అది దొరికిన వెంటనే ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ట చేస్తామని తెలిపారు.
మహాసంప్రోక్షణ ప్రారంభం
ధ్వజస్తంభం విరిగిపడడంతో లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆగమ పండితులు, అర్చకస్వాములు మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండురోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆగమ బ్రహ్మ పాణింగపల్లి వెంకట గోపాల రవిబాబు, పాణికపల్లి పవన్కుమార్ ఆచార్యులు తెలిపారు. సంప్రోక్షణలో ఆలయ అనువంశక అర్చక స్వాములు, గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మిసరోజ, కర్రి వీరగణేష్, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.