హత్య కేసులో భార్యతో సహా ఐదుగురి అరెస్టు
ABN , First Publish Date - 2021-10-25T06:02:54+05:30 IST
భర్తను హత్యచేయించిన భార్య సహా ఐదుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బొమ్మూరు పోలీసులు అందించిన వివరాల ప్రకారం..

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 24: భర్తను హత్యచేయించిన భార్య సహా ఐదుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బొమ్మూరు పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. విజయవాడ ఆటోనగర్కు చెందిన వి.రాము (40), భవాని భార్యభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. రాము తన వ్యాన్ మీదే డ్రైవర్గా చేస్తున్నాడు. వారి బంధువుల్లోని ప్రసాద్ అనే వ్యక్తితో భవానికి వివాహేతర సంబంధం ఉంది. అందుకు భర్త అడ్డంగా ఉండడంతో అతన్ని హత్య చేయాలని భవాని, ప్రసాద్ నిర్ణయించుకున్నారు. విజయవాడకు చెందిన కనకరాజు, ఫిరోజు, ఉయ్యూరుకు చెందిన వెంకటసాయికృష్ణ, సయ్యద్ బాజిలకు ఆ పనిని అప్పగించారు. రామును ఈ నలుగురు విశాఖ నుంచి లోడు తీసుకురావాలని కిరాయి మాట్లాడుకుని, ఈనెల 4న విజయవాడ నుంచి బయలుదేరారు. ఆదే రోజు రాత్రి రాజమహేంద్రవరం సమీపంలోకి చేరుకుని ధవళేశ్వరంలో మద్యం తాగి, మత్తులో ఉన్న రామును టార్పాలిన్ సంచితో ముఖంపై నొక్కి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. మృతదేహాన్ని వ్యాన్లో ఉంచి దివాన్చెరువు గైట్ కాలేజీ సమీపంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో వ్యాన్తో సహా వదిలి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత స్థానికులు చూసి పోలీసులు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాము భార్య భవానిని, హత్యచేసిన నలుగురిని అరెస్టు చేశారు. భవాని ప్రియుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్టు బొమ్మూరు పోలీసులు తెలిపారు.