డిసెంబరు 25 నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వాలి
ABN , First Publish Date - 2021-06-25T05:59:08+05:30 IST
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇళ్లు నిర్మించుకునే వారందరూ డిసెంబరు 25 నాటికి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి సూచించారు.
- కలెక్టర్ మురళీధర్రెడ్డి.. బిక్కవోలులో ఇళ్ల నిర్మాణాల పరిశీలన
బిక్కవోలు, జూన్ 24: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇళ్లు నిర్మించుకునే వారందరూ డిసెంబరు 25 నాటికి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి సూచించారు. గురువారం బిక్కవోలులో 18.19 ఎకరాల లేఅవుట్లో జరుగుతున్న 730 ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తోందని, డ్వాక్రా మహిళలకు అదనంగా రూ.50 వేలను రుణంగా అందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులందరూ త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని, కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్తో కలసి డ్వాక్రా మహిళలకు రూ.50వేల చెక్కులను అందజేశారు.
గ్రామ సచివాలయాలు ప్రారంభం
భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా బిక్కవోలులో రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయం-1, రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయం-3 భవనాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ విధుల నిర్వహణకు శాశ్వత భవనాలు వచ్చినందున మరింత సమర్థవంతంగా సేవలందించాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు మరిన్ని సేవలందించడానికి రైతు భరోసాకేంద్రాలు, వైఎస్ఆర్ ఆరోగ్యకేంద్రాలు, బల్క్మిల్క్ యూనిట్లకు కూడా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. మంజూరు చేసిన నిధుల కంటే తక్కువ మొత్తంలో పనులు పూర్తిచేయించినందుకు ఆయన పంచాయితీరాజ్ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జేవీవీ.సుబ్బారెడ్డి, జాయింట్ కలెక్టర్లు జి.రాజకుమారి, ఎ.భార్గవతేజ, జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్వీ నాగేశ్వరనాయక్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, రామచంద్రపురం ఆర్డీవో సింధుసుబ్రహ్మణ్యం, సర్పంచ్, ఉపసర్పంచ్లు సరెళ్ల సుమలత, జె.మురళీకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్, హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.