కొండెక్కిన ఇళ్లు!

ABN , First Publish Date - 2021-06-19T06:19:27+05:30 IST

గోదావరికి వరదొస్తే కొండలపైనే బస చేయడం అక్కడి గిరిజనులకు అలవాటు.

కొండెక్కిన ఇళ్లు!
తాళ్లూరులో గోదావరికి ఆనుకుని ఉన్న కొండలపై గిరిజనులు నిర్మించుకుంటున్న పాకలు..

గోదావరికి వరదొస్తే కొండలపైనే బస
కొండమొదలు పంచాయతీ గ్రామాల్లో గిరిజనుల ముందస్తు ఏర్పాట్లు

(రంపచోడవరం)
గోదావరికి వరదొస్తే కొండలపైనే బస చేయడం అక్కడి గిరిజనులకు అలవాటు. అయితే ఈ మారు వచ్చే వరద అంత తొందరగా గ్రామాలను వదిలిపోదు అన్న ముందస్తు హెచ్చరికలతో గోదావరి లోయ గిరిజనులు తమ గ్రామాలకు సమీపంలో ఉన్న కొండలపై ఎక్కువ రోజులు బస చేసేందుకు వీలుగా తాటాకు పాకలు సిద్ధం చేసుకున్నారు. తమకు వరద సమయంలో అవసరమైన నిత్యావసర వస్తువులను కూడా వారు సమీకరించుకుంటున్నారు. మరోపక్క ఆయా గ్రామాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను సుమారు రెండు నెలలకు సరిపడా ఆయా డీఆర్‌ డిపోలకు చేర్చాలని కూడా అధికారులు ఆదేశాలిచ్చారు. ఇటు తమ ఇళ్లల్లో ఉన్న విలువైన వస్తు సామగ్రిని కూడా ఆయా గిరిజనులు ఇతర సురక్షిత ప్రాంతాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు చేరవేసుకుంటున్నారు. వరద తమ గ్రామాలను ముంచేసి, ఈసారి త్వరగా వీడని పరిస్థితులు ఉంటాయని తెలిసినప్పటికీ గిరిజనులు ఆ బాధలను భరిస్తూనే తమ స్వగ్రామాల సమీపంలోని కొండలపైనే ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఒకవేళ  వరదల కారణంగా గ్రామాలు వదిలి దూరంగా వెళ్లిపోతే పోలవరం పునరావాస చర్యలు పూర్తి చేయకుండానే అధికారులు తమను తిరిగి గ్రామాలకు రానివ్వరన్న ఆందోళనతోనే గిరిజనులు గ్రామాలను ఖాళీ చేసేందుకు ఇష్టపడటం లేదు.


Updated Date - 2021-06-19T06:19:27+05:30 IST