గుడిగళ్లభాగలో స్థల వివాదం: ఐదుగురికి గాయాలు
ABN , First Publish Date - 2021-10-19T05:39:28+05:30 IST
మండలంలోని గుడిగళ్లభాగలో శనివారం రాత్రి ఒక స్థలవివాదంలో జరిగిన గొడవలో ఐదుగురికి గాయాలయ్యాయని పామర్రు ఎస్.ఐ. కె.చిరంజీవి తెలిపారు.
![గుడిగళ్లభాగలో స్థల వివాదం: ఐదుగురికి గాయాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కె.గంగవరం, ఆక్టోబరు 18: మండలంలోని గుడిగళ్లభాగలో శనివారం రాత్రి ఒక స్థలవివాదంలో జరిగిన గొడవలో ఐదుగురికి గాయాలయ్యాయని పామర్రు ఎస్.ఐ. కె.చిరంజీవి తెలిపారు. గ్రామానికి చెందిన రెడ్డి పెద వెంకట్రావు 25ఏళ్లుగా గ్రామంలో సెంటున్నర స్థలంలో తాటాకు పాక వేసుకుని గేదెలు పెంచుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తాము సూచించిన అభ్యర్థికి ఓటు వేయలేదనే నెపంతో కొందరు పెద్దలు పాకను తొలగించమని ఒత్తిడి తెచ్చారు. అక్కడ దుర్గమ్మగుడి కట్టిస్తామని చెప్పారు. దీనికి వెంకట్రావు అంగీకరించలేదు. దీంతో ఈనెల16న రాత్రి కొందరు పాకను తొలగించడానికి ప్రయత్నించారు. అప్పుడు జరిగిన కొట్లాటలో అడ్డుపడిన రెడ్డి వీరవెంకట సత్యనారాయణ, అతడి భార్య వరలక్ష్మిలకు తలపై గాయాలయ్యాయి. రెడ్డి సూరిబాబు, త్రిమూర్తులు, మణికంఠలకు దెబ్బలు తగిలాయి. దీనిపై రెడ్డి వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్, గుబ్బల నాగేశ్వరరావు మరికొంత మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.