ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా
ABN , First Publish Date - 2021-12-04T05:59:01+05:30 IST
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు 50 మంది నుంచి రూ.60 లక్షలు వసూలు చేసిన సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో రెగ్యులర్ పోస్టులు వేయిస్తామంటూ ఓ అంధ ఉద్యోగితో పాటు మరో వ్యక్తి కీలక సూత్రధారిగా ఉన్నట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- 50 మంది నుంచి సుమారు రూ.60 లక్షలు వసూలు
- అంధ ఉద్యోగితో పాటు మరో వ్యక్తి ప్రమేయం
- కాకినాడ టూటౌన పోలీసులకు బాధితుల ఫిర్యాదు
కాకినాడ క్రైం, డిసెంబరు 3: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు 50 మంది నుంచి రూ.60 లక్షలు వసూలు చేసిన సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో రెగ్యులర్ పోస్టులు వేయిస్తామంటూ ఓ అంధ ఉద్యోగితో పాటు మరో వ్యక్తి కీలక సూత్రధారిగా ఉన్నట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ పి.ఈశ్వరుడు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరానికి చెందిన జేరి రవికిషోర్ అంథుడు కావడంతో దివ్యాంగుల కోటాలో 2016లో జీజీహెచ్లో రెగ్యులర్ ఉద్యోగిగా స్వీపర్ పోస్టు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజానగరం మండలం దివాన్చెరువు శ్రీరాంపురానికి చెందిన గొల్లల లక్ష్మీప్రసాద్ నాయుడు రవికిషోర్తో నేను నీ భార్యకు దూరపు బంధువని, సివిల్ కాంట్రాక్టర్ అని చెప్పి పరిచయం పెంచుకున్నాడు. జాతీయ ఆరోగ్య మిషన్లో ఉన్నతాధికారులు తనకు పరిచయం ఉందని... జూనియర్ అసిస్టెంట్, అటెండర్, పీఆర్వో, విజిలెన్స్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులను తక్కువ రేటుకే ఇప్పిస్తానని, నిరుద్యోగుల్ని చూడమని చెప్పా డు. దాంతో రవికిషోర్, ప్రసాద్ దివ్యాంగుల గ్రూపులో ఉన్న నిరుద్యోగులు, అవుట్ సోర్సిం గ్ ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు ఇతర నిరుద్యోగులను ఆకట్టుకున్నాడు. ముందుగా సగం సొమ్ము ఇచ్చేలా, పోస్టింగ్ వచ్చిన తర్వాత మిగతా సగం ముట్టచెప్పేలా నిరుద్యోగులతో బేరం కుదుర్చుకున్నారు. సుమారు 50 మంది ఇచ్చిన సుమారు రూ.60 లక్షలను రవికిషోర్ భార్య అనురాధ బ్యాంకు అకౌంట్ కు బదిలీ చేశారు. ఆ డబ్బులను లక్ష్మీప్రసాద్నాయుడు అనురాధ ఏటీఎం కార్డు ద్వారా తీసుకుని పరారయ్యాడు.
నిందితులు ఇచ్చిన నకిలీ నియామక పత్రాలతో విశాఖ డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో విధుల్లో చేరేందుకు వెళ్లగా అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. మోసపోయామని గుర్తించిన ఓ నిరుద్యోగి సూదా లక్ష్మీనారాయణ కాకినాడ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరికొంత మంది నిరుద్యోగులు కూడా పోలీసుల వద్దకు వెళ్లి తాము మోసపోయినట్టు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఈశ్వరుడు తెలిపారు. రవికిషోర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, లక్ష్మీప్రసాద్నాయుడు కోసం గాలింపు చేపట్టామన్నారు. రవికిషోర్ ను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ ఇప్పటికే విచారించారని, ఈ వ్యవహారాన్ని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.