మొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్
ABN , First Publish Date - 2021-12-09T05:30:00+05:30 IST
రాజమహేంద్రవరంలో సెంట్రల్ విజిటబుల్ మార్కెట్ వద్ద ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో మొట్టమొదటి 33/11 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు.

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 9: రాజమహేంద్రవరంలో సెంట్రల్ విజిటబుల్ మార్కెట్ వద్ద ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో మొట్టమొదటి 33/11 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. గురువారం ఈ సబ్స్టేషన్ను ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ టీవీఎస్ఎన్ మూర్తి పరిశీలించి చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్కిషోర్, వారి అధికారుల బృందం సహాయంతో ఈ సబ్స్టేషన్ అత్యున్నత స్థాయిలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించినట్టు తెలిపారు. సాధారణంగా అవుట్డోర్ సబ్స్టేషన్ నిర్మాణానికి 1100 చదరపు గజాల స్థలం అవసరమౌవుతుందని అయితే ఈ సబ్స్టేషన్ 200 చదరపు గజాల చిన్న స్థలంలో టెక్నాలజీతో మొట్టమొదటిది గా ఏర్పాటు చేయడం పట్ల ఎస్ఈ సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఇండోర్ సబ్స్టేషన్లో ఓ పవర్ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే వుంటుందని తెలిపారు. అనంతరం ఈఈ కె.తిలక్కుమార్ దీని ప్రాముఖ్యతను వివరించారు. ఇది రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు, రెండు రైల్వేట్రాక్ల మధ్య ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేస్తుందని చెప్పారు. రెండు రైల్వే ట్రాక్ల మధ్య ప్రాంతంలో విద్యుత్ 33కేవీ లైన్ వేయడం ఒక విశేషమని అన్నారు. దీని రివర్ వ్యూ ఎస్ఎస్ వాటర్ వర్క్సు ఎస్ఎస్, జాంపేట ఎస్ఎస్, తాడితోట ఎస్ఎస్, గౌతమి ఎస్ఎస్ కలిపి మొత్తం ఐదు 33/11 కేవీ ఫీడర్ల ద్వారా నమ్మదగిన విద్యుత్ సరఫరా చేస్తుందని చెప్పారు. లైన్లు సబ్స్టేషన్ నిర్మాణంలో ఈఈ కనస్ట్రక్షన్ పీవీఎస్ఎస్వీ రామ్మూర్తి, నారాయణరావు, ఆనంద్ప్రసాద్, ఏఈఈ కె.సురేష్, డీఈఈ జేపీబీ నటరాజన్ సమన్వయంతో పనిచేశారు.