మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
ABN , First Publish Date - 2021-02-08T06:50:06+05:30 IST
మన్యంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. ఆదివారం ఆయన చింతూరు మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు.
![మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం](https://media.andhrajyothy.com/appimg/galleries/202102080117356/02082021011832n93.jpg)
- ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
చింతూరు, ఫిబ్రవరి 7: మన్యంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. ఆదివారం ఆయన చింతూరు మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఇందులో భాగంగా ఛత్తీస్గడ్ సరిహద్దు చిడుమూరు, ఏడుగరాళ్ళపల్లి పోలింగు కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. ఒడిశా, ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో మావోయిస్టు ప్రభావం ఉన్నందున ఆ మేరకు అవసర మైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇందులోభాగంగా గ్రేహౌండ్, సీఆర్పీఎఫ్ తదితర బలగాలను మోహరింపజేశామన్నారు. ఇక రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మన్యంలో పోలింగ్ సమయం కుదించడం జరిగిందన్నారు. ఉదయం 6.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30 గంటలకు పోలింగ్ ముగియనుందని, ఓటర్లు ఆ వ్యవధిలో ఓటు వేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ ఖాదర్బాషా, సీఐ యువకుమార్, ఎస్ఐ సురేష్కుమార్ పాల్గొన్నారు.