ముంపునీటిలో కుళ్లుతున్న సార్వా చేలు
ABN , First Publish Date - 2021-08-26T04:36:15+05:30 IST
ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైయిన్లు ఎగదన్ని ముంపునీరు దిగక వరి పొలాలు జలాశయాలుగా మారాయి.

దిగాలు చెందుతున్న రైతులు
అల్లవరం, ఆగస్టు 25: ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైయిన్లు ఎగదన్ని ముంపునీరు దిగక వరి పొలాలు జలాశయాలుగా మారాయి. సార్వానాట్లు వేసిన వరిచేలు ముంపు నీటిలో కుళ్లుతుండ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు సాగుచేసిన సార్వాచేలు ముంపు నీటిలో కుళ్లుతుండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని రైతాంగం ఆందోళన చెందుతోంది. పంచనది డ్రైయిన్, వాసాలతిప్ప, వాటి అనుబంధ డ్రైయిన్లలో ముంపునీరు దిగని పరిస్థితి నెలకొంది. రెల్లుగడ్డ, గోడిలంక, తూర్పులంక, గోడి, అల్లవరం, గూడాల, తాడికోన, కొమరగిరిపట్నం పరిసర గ్రామాల్లో వరి పొలాలు ముంపు నీటిలో చిక్కుకున్నాయి. రెండు మూడు రోజుల్లో ముంపునీరు దిగకుంటే వరి దుబ్బులు కుళ్లి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.