ఇక పోరే...!

ABN , First Publish Date - 2021-02-05T07:25:05+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టానికి ఎట్టకేలకు తెరపడింది. గ్రామాల్లో పోటీ చేయడానికి బరిలో ఉన్న పార్టీల నేతలెవరో తేలిపోయింది. దీంతో శుక్రవారం నుంచి ప్రచారాల రూపంలో అసలుసిసలు పంచాయతీ పోరు గ్రామాల్లో ఊపందుకోనుంది.

ఇక పోరే...!

  • ముగిసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం
  • మొదటి దశ ఎన్నికల బరిలో 335 పంచాయతీల్లో 893 సర్పంచ్‌ అభ్యర్థులు
  • అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 23 పంచాయతీల్లో 67 మంది అభ్యర్థుల పోటీ
  • 3,735 వార్డు స్థానాలకు పోటీలో 6,288 మంది అభ్యర్థులు 
  • మొత్తం 28 పంచాయతీలు ఏకగ్రీవం.. కాకినాడ డివిజన్‌లో 13, పెద్దాపురం పరిధిలో 15 
  • ఏకగ్రీవాల్లో మెజార్టీ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలో..
  • కోటనందూరు, పిఠాపురం, ప్రత్తిపాడు, కోటనందూరు, పెద్దాపురం మండలాల్లో ఏకగ్రీవాలు జీరో
  • అటు 4,100 వార్డు స్థానాలకు 365 చోట్ల ఏకగ్రీవం

  • (కాకినాడ-ఆంధ్రజ్యోతి)
  • పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టానికి ఎట్టకేలకు తెరపడింది. గ్రామాల్లో పోటీ చేయడానికి బరిలో ఉన్న పార్టీల నేతలెవరో తేలిపోయింది. దీంతో శుక్రవారం నుంచి ప్రచారాల రూపంలో అసలుసిసలు పంచాయతీ పోరు గ్రామాల్లో ఊపందుకోనుంది. ఇన్ని రోజుల నుంచి ఎత్తులకుపైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు, సామాజికవర్గాల వారీగా కుల సమీకరణలతో ఊపిరి సలపకుండా ఉన్న నేతలు ఇక ప్రచారంలో తాడోపేడో తేల్చుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగియగా కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 28 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవికాక మరో మూడు  సర్పంచ్‌ స్థానాలు మాత్రమే ఏకగ్రీవం అయి వార్డు సభ్యుల స్థానాలకు ఏకగీవ్రం కాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే 335 పంచాయతీల్లో మొత్తం 893 మంది సర్పంచ్‌ సీటు కోసం పోటీలో నిలబడ్డారు. 4,100 వార్ఢు స్థానాలకు 365 చోట్ల ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగే 3,735 వార్డు స్థానాలకు పోటీలో 6,288 మంది అభ్యర్థులు ఉన్నట్టు తేలింది.

  • పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో పోటీ బరిలో మిగిలిన అభ్యర్థులు ఎవరనేదానిపై స్పష్టత వచ్చింది. వాస్తవానికి ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఏ మాత్రం సుముఖంగా లేని అధికార వైసీపీ ఎక్కడికక్కడ ఎన్నికలు లేకుండా పంచాయతీలను ఏకగ్రీవం చేయించుకునేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగించింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని, పలుచోట్ల పోలీసుల సా యంతో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు టీడీపీ సహా ఇతర పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్లు పడకుండా బెదిరింపులకు దిగింది. ధిక్కరించి నిలబడిన వారిని సైతం గురువారం వరకు నామినేషన్ల ఉపసంహరణ వరకు వెంటాడుతూనే ఉంది. బలమైన అభ్యర్థులను నగదు,కాంట్రాక్టుల ఎరవేసి లాక్కునేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది. అయితే ఇవి కొంతవరకు ఫలించాయి. కాకినాడ రూరల్‌, ప్రత్తిపాడు,   పిఠాపురం, జగ్గంపేట, తుని నియోజకవర్గాల పరిధిలో కొన్నిచోట్ల అధికార పార్టీ నేతల బెదిరింపులు సైతం పనిచేయలేదు. ధైర్యంగా టీడీపీతోపాటు ఇతర పార్టీల అభ్య ర్థులు నిలబడ్డారు. దీంతో గురువారంతో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో అధికార వైసీపీ ప్రయత్నాలు చాలావరకు బెడిసికొట్టాయి. ఎక్కువ నామినేషన్లు విత్‌డ్రా చేయించి సింగిల్‌ నామినేషన్ల పేరుతో ఏకగ్రీవాల సంఖ్య పెంచుకుందామనే వ్యూహాలు బెడిసికొట్టాయి. చివరకు తొలి విడత ఎన్నికలు జరిగే కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 20 మండలాల్లోని 366 పం చాయతీలకు గాను 28 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో మెజార్జీ పంచాయతీలు వైసీపీ అన్ని రకాల అస్త్రాలతో దక్కించుకుంది. ముఖ్యంగా తొండంగి మండలంలో తొండంగి, కొమ్మనాపల్లి పంచాయతీలు ఏకగ్రీవం కాగా, తునిలో 19 పంచాయతీలకు రెండు ఏకగ్రీవమయ్యాయి. కాకినాడ రూరల్‌ మండలంలో తమ్మవరం పంచాయతీ ఒకటి ఏకగ్రీవమైంది. గొల్లప్రోలు మండలంలో 10 పంచాయతీలకు రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఎనిమిది పంచాయతీలకు 23 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. గండేపల్లిలో 18 పంచాయతీలకు మూడు ఏకగ్రీవంకాగా, మిగిలిన 15 పంచాయతీల్లో 40 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో మిగిలారు. రంగంపేటలో 17 సర్పంచ్‌ లకు పెదరాయవరం ఏకగ్రీవంకాగా, 16 సర్పంచ్‌ స్థానాల్లో 40 మంది బరిలో ఉన్నారు. పెదపూడిలో 18 పంచాయతీలకు రెండు ఏకగ్రీవమయ్యాయి. కరప మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం గా తేలాయి. శంఖవరం మండలంలో 14 పంచాయతీలకు మూడు, ఏలేశ్వరంలో 12 పంచాయతీలకు రెండు, కిర్లంపూడిలో 19కిగాను ఒకటి, రౌతులపూడిలో 26కి మూడు, తాళ్లరేవులో 17కి ఒకటి, సామర్లకోటలో 18 పంచాయతీలకు ఒకటి, యు.కొత్తపల్లిలో ఒక పంచాయతీ చొప్పున ఏకగ్రీవమయ్యాయి. పెద్దాపురం డివిజన్‌ పరిధిలో మొత్తం 12 మండలాల్లో 226 పంచాయతీలకుగాను 15 పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులు మొత్తం ఏకగీవ్రమయ్యాయి. రెండుచోట్ల ఒక్క సర్పంచ్‌ స్థానాలే ఏకగ్రీవమ య్యాయి. కాకినాడ డివిజన్‌లో 140 పంచాయతీల్లో 13 పంచాయతీలు ఏకగీవ్రం అయ్యాయి.
  • ఆ పంచాయతీల్లో జీరో..
  • అధికార వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా, వ్యూహప్రతివ్యూహాలు రచించినా, ప్రలోభాలు, బెదిరింపులకు దిగినా కొన్ని మండలాల్లో ఎక్కడా టీడీపీని ఢీకొట్టలేకపోయాయి. దీంతో ప్రతి పంచాయతీలో పోటీ తప్పనిసరి అయింది. పెద్దాపురంలో 23 పంచాయతీలుండగా, ఆరుచోట్ల ఏకగ్రీవాలకు వైసీపీ పథకం రచించింది. ఎక్కడికక్కడ టీడీపీ నేతలకు ఎరవేసింది. కానీ ఏదీ ఫలించలేదు. దీంతో ఒక్క ఏకగ్రీవం కూడా ఈ మండలంలో అవలేదు. కోటనందూరు మండలంలో 17 పంచాయతీలకు 43 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ ఏక గ్రీవ పంచాయతీలు సున్నా. కేవలం అధికార పార్టీ రెండుచోట్ల వార్డులను ఏకగ్రీవం చేసుకోగలిగింది. పిఠాపురం రూరల్‌లో 24 పంచాయతీలుం డగా, ఇక్కడ కూడా ఒక్క ఏకగ్రీవం జరగలేదు. అయితే 20 వార్డు స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుని సరిపెట్టుకుంది. ప్రత్తిపాడు మండలం లో 23 పంచాయతీలకు ఒక్కటీ ఏకగీవ్రం కాలేదు. అధికార పార్టీ కీలకనేత అన్ని రకాల అస్త్రాలు ఉపయోగించినా ఏదీ ఫలించలేదు. మొత్తం ఇక్కడ 67 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కోటనందూరులో 17 పంచాయతీలకు ఏకగ్రీవం ఏ ఒక్కటీ కాలేదు.
  • బరిలో వీరే...
  • తొలివిడత కింద కాకినాడ, పెద్దాపరం రెవె న్యూ డివిజన్‌ పరిధిలోని 20 మండలాల్లో 366 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ గా, 28 ఏకగ్రీవాలు పోను మిగిలిన 338 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మూడు చోట్ల సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, వార్డు స్థానాలు మాత్రం ఏకగీవ్రం కాలేదు. దీంతో 335 పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో 893 సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 23 పంచాయతీల్లో 67 మంది అభ్యర్థులు సర్పంచ్‌ సీటుకు పోటీపడుతున్నారు. అటు 4,100 వార్డులకు ఎన్ని కల నోటిఫికేషన్‌ వెలువడగా, ఏకగ్రీవాలు పోను ఇంకా 3,735 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 6,288 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో అత్యధికంగా పెద్దాపురం మండలంలో 564 మంది పోటీ చేస్తున్నారు.

Updated Date - 2021-02-05T07:25:05+05:30 IST