ఈ-పంట నమోదులో జాప్యం
ABN , First Publish Date - 2021-07-11T06:50:24+05:30 IST
జిల్లాలో వివిధ పంటల సాగుపై వ్యవసాయ శాఖ చేప ట్టాల్సిన ఈ-పంట నమోదు ప్రస్తుత ఖరీఫ్లో శనివారం సాయంత్రానికి కూడా ప్రారంభించలేదు.
ప్రారంభంకాని నమోదు.. బీమా పథకాల వర్తింపుపై అనుమానాలు
సామర్లకోట, జూలై 10: జిల్లాలో వివిధ పంటల సాగుపై వ్యవసాయ శాఖ చేప ట్టాల్సిన ఈ-పంట నమోదు ప్రస్తుత ఖరీఫ్లో శనివారం సాయంత్రానికి కూడా ప్రారంభించలేదు. ప్రభుత్వపరంగా రైతులు ఏ లబ్ధి పొందాలన్నా పంటల నమోదు తప్పనిసరి. రైతు భరోసా, పంటల బీమా, విత్తనాలు, ఎరువులు పంపిణీ, వడ్డీ రాయితీలతోపాటు పంట ఉత్పత్తుల విక్రయాలకు గిట్టుబాటు ధర, నష్ట పరిహార చెల్లింపులు వంటి సదుపాయాలు ఈ-పంట నమోదుల ప్రాతిపదికన వ్యవసాయా ధికారులు వర్తింపజేస్తారు. వీటితోపాటు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపో యినా, రైతు పాడి సంపదలో భాగంగా ఆవులు, గేదెలు మరణించినా రైతులకు పరిహార పొమ్ము చెల్లిస్తారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రతీ ఏటా జూన్ నెల నుంచి ఈ-పంట నమోదులు మొదలుపెట్టి సెప్టెంబరు నెల వరకూ రైతులు సాగు చేసే పంటల వివరాలు నమోదుచేయాలి. రబీ సీజన్కు అక్టోబరు నుంచి మార్చి నెలల మధ్య నమోదు చేయాలి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో భాగంగా గత నెల 15నే గోదావరి కాలువలకు సాగునీటిని విడుదల చేయడంతో రైతులు ఖరీఫ్ సాగు పను ల్లో నిమగ్నమయ్యారు. ఇటుచూస్తే శనివారం సాయంత్రం వరకూ ఈ-పంట నమో దుల ప్రక్రియ జిల్లాలో వ్యవసాయశాఖ చేపట్టలేదు. దీంతో రైతులు ప్రభుత్వ పథ కాలు తమకు వర్తిస్తాయా, లేదా అని కలవరం చెందుతున్నారు. ఈ-పంట నమో దు కోసం వ్యవసాయశాఖ యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫాం యాప్ను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఏడాది పంటల నమోదు ప్రక్రియలో వ్యవసాయ, ఉద్యాన వన, మత్స్యశాఖ, పశుసంవర్ధక, సెరికల్చర్ తదితర అనుబంధ శాఖలను కూడా ప్రభుత్వం ఈ యాప్లో చేర్చింది. యాప్లో సర్వే నెంబరు నమోదు చేయగానే సంబంధిత రైతు వివరాలు కంప్యూటర్లో కనిపించాలి. కొత్తగా వేసిన పంటల వివ రాలను సచివాలయ, వ్యవసాయశాఖ, రైతుభరోసా కేంద్రాల సిబ్బంది, ఇతర వ్యవ సాయ అనుబంధ శాఖల సిబ్బంది నమోదు చేయాలి. రైతుల అభ్యంతరాల మేరకు ఎటువంటి మార్పులుచేర్పులు ఉన్నా సరిచేయాలి. అనుబంధ శాఖల రైతులు కూడా ఈ-క్రాప్లో వివరాలు నమోదు చేస్తేనే ప్రభుత్వం నుంచి లబ్ధి దక్కుతుంది. యాప్లో గతేడాది రెవెన్యూ లెక్కల ప్రకారం భూముల వివరాలను పొందుపరి చారు. ఈ-పంట నమోదు ప్రక్రియ సత్వరం ప్రారంభించాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఇక ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 5,54,149 ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్దేశించారు. అయితే యాప్ ఇంకా డౌన్లోడ్ కాకపోవడంతో వ్యవసాయ సబ్బంది ఈ-పంట నమోదులు చేపట్టలేకపోయారు. దీనిపై జిల్లా వ్యవసా యాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా రెండు రోజుల్లో యాప్ డౌన్లోడ్ కావచ్చొని చెప్పారు.